''అయ్యో పాపం...ఆయన రెండు మండలాలకే ఎమ్మెల్యే''
- తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతోందన్న హరిష్ రావు
- అందుకోసమే నియోజకవర్గాల పెంపుపై ఆలస్యం చేస్తోంది
నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్షను చూపెడుతూనే ఉందని మంత్రి హరిష్ రావు అన్నారు. అందుకు నిదర్శనమే భద్రాచలంలోని ఐదు మండలాలను ఎపి లో కలపడమేనని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దీని కారణంగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండాల్సిన సున్నం రాజయ్య రెండు మండలాలకు ఎమ్మెల్యేగా మారాడు. ఐదు మండలాలను ఆంధ్రాకు దారాదత్తం చేయడమే చెబుతుంది తెలంగాణ అంటే కేంద్రానికి ఎంత ప్రేమో అని మంత్రి ఎద్దేవా చేశారు. ఐదు మండలాల ప్రజలకు ఎమ్మెల్యే ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. విభజన ఇలాగేనా చేసేది అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇకనైనా కేంద్రం కాస్త తెలంగాణ సమస్యలపై కూడా కాస్త దృష్టి పెట్టాలని సూచించారు. తాము ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న నియోజకవర్గాల పెంపు అంశంపై దృష్టి సారించాలని, దానిపై రోజుకో విధంగా ప్రకటన చేయడం మానుకోవాలని అన్నారు. నియోజకవర్గాల పెంపు తమ పార్టీ ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాలకోసమేనన్న విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టిలోపెట్టుకుని త్వరగా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.