విజయవాడలో ఇంటర్మీడియట్ విద్యార్థిని పై బ్లేడ్ బ్యాచ్ దాడి
విశేష వార్తలు
- మేడ్చల్ జిల్లాలో దొంగల భీభత్సం, మహిళపై కత్తులతో దాడి
- వేములవాడలో తన భార్యను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న సైకో భర్త
- బంజారాహిల్స్ లో చైన్ స్నాచర్ అరెస్ట్
- కొత్తగూడెం కేటిపిఎస్ అగ్నిప్రమాదం
- కొవ్వూరు వద్ద రోడ్డుప్రమాదం, యువకుడి మృతి
జవహార్ నగర్ లో దొంగల భీభత్సం
మేడ్చల్ జిల్లా : జవహార్ నగర్ దమ్మాయ్ గూడలో దొంగలు దారుణానికి ఒడిగట్టారు. వికాస్ నగర్ కాలనీలో పట్టపగలే ఒంటరి మహిళను టార్గెట్ చేసిన దొంగలు మహిళలపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఓ ఇంట్లో సెట్ ఆఫ్ బాక్స్ అమర్చుతామని ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న రజిత(30)అనే మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లడానికి ప్రయత్నించారు.దీంతో ప్రతిఘటించిన మహిళ తల పై కత్తితో పొడిచి, రక్తపుమడుగులో కిందపడ్డ ఆమె మెడలోంచి బంగారాన్ని తీసుకుని పారిపోయారు.
మహిళ గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
భార్యను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త
రాజన్న సిరిసిల్ల జిల్లా లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పై కత్తితో దాడి చేసి తర్వాత తానూ గొంతుకోసుకొన్న విషాద సంఘటన వేములవాడ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వేములవాడ లోని సుభాష్ నగర్ కు చెందిన వసంత కు జగిత్యాల జిల్లా నర్సింగపురం గ్రామానికి చెందిన రవి తో కొద్దీ సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా బార్యాభర్తల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.
అయితే ఇవాళ ముగ్గురి పిల్లలతో కలిసి వారు వేములవాడ బస్టాండ్ నుంచి ఇంటికి వెలుతుండగా ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన రవి తన భార్యపై కత్తితో దాడి చేసి, తర్వాత తాను కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో వసంత అక్కడికక్కడే మృతి చెందగా భర్త రవి పరిస్థితి విషమంగా మరడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆరుబయటే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పురిటినొప్పులతో డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ వరండాలోనే బిడ్డకు జన్మనిచ్చింది. మహిళకు రక్తపోటు అధికంగా ఉందనే కారణంతో డెలివరీ చేయకుండా వరండాలోనే ఉంచడంతో ఆమె అక్కడే ప్రసవించింది. అయితే ఈ ఘటనలో పిల్లాడికి స్వల్పంగా గాయాలవగా, తల్లి మాత్రం క్షేమంగా ఉంది. బాధిత మహిళ బందువుల ఆగ్రహంతో దిగివచ్చిన ఆస్పత్రి సిబ్బంది ప్రస్తుతం మహిళను వార్డుకు చేర్చి వైద్యం అందిస్తున్నారు.
తూప్రాన్ లో బైక్ దొంగల ముఠా అరెస్టు
మెదక్ జిల్లా తూప్రాన్ లో దొంతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ లో మకాం వేసిన నలుగురితో కూడిన దొంగల ముఠా మంచి బైక్ కనిపిస్తే చాలు దొంగతనానికి పాల్పడేది. వీరి వద్ద నుంచి సుమారు ఐదు లక్షల విలువ చేసే 10 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ డిఎస్పి బాస్కర్ తెలిపారు.
జైలు సిబ్బందిపై దాడికి పాల్పడిన ఖైదీలపై చర్యలు
హైదరాబాద్ : చంచల్ గూడ జైలులో ఇటీవల జైలు సిబ్బందిపై దాడి చేసిన ఉగ్రవాద ఖైదీలపై చర్యలకు పూనుకున్నారు జైలు అధికారులు. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాద ఖైదీలకు ప్రిజన్స్ రూల్స్ ప్రకారం మూడు నెలలు మూలాఖత్ ని నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వీరికి ఈ మూడు నెలల పాటు ఎవరిని కలవనివ్వమని, ఎలాంటి ఆహారపదార్థాలను గానీ, వస్తులను గానీ బయటినుంచి అందకుండా చూస్తామని జైలు అధికారులు తెలిపారు.
విజయవాడలో ఇంటర్మీడియట్ విద్యార్థిని పై బ్లేడ్ బ్యాచ్ దాడి
విజయవాడ ఇంటర్మీడియట్ విద్యార్థినిని అపహరించడానికి కొందరు దుండగులు ప్రయత్నించారు. బైక్ ల పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర విద్యార్థినిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. దీనికి యువతి ప్రతిఘటించడంతో బ్లేడ్ తో దాడిచేసి పారిపోయారు. దీనిపై విద్యార్థిని నుంచి పిర్యాదును స్వీకరించిన పోలీసులు, సీసీ టీవి పుటేజిల ఆధారంగా దుండగులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
బంజారాహిల్స్ లో చైన్ స్నాచర్ అరెస్ట్
బంజారా హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వాకర్స్, ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నర్సింహ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ, సీసీ కెమెరాలకు గాని, పోలీసులకు గాని చిక్కకుండా ఇతడు తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఇవాళ బంజారాహిల్స్ ప్రాంతంలో దొంగతనం కోసం రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు చిక్కాడు. ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
కేటీపిఎస్ లో అగ్నిప్రమాదం, విద్యుత్ ఉత్పత్తి కి అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని 11 వ యూనిట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్ పార్మర్ పేలిన ఘటనతో యూనిట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల యూనిట్ లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
యువ డాక్టర్ ని బలిగొన్న రోడ్డు ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. రాజమండ్రిలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్న తూటా రమేష్(29) అనే యువకుడు ప్రయాణిస్తున్న బైక్ ను లారీ డీకొట్టడంతో అతడు ప్రమాద స్థలంలోనే ప్రాణాలొదిలాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సికింద్రాబాద్ లో ప్రమాదం, ఇద్దరికి గాయాలు
సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ లోని సిటిలైట్ హోటల్ వద్ద ప్రమాదం జరిగింది. రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీ వాహనాలను నియంత్రించడానికి ఏర్పాటుచేసే హోర్డింగ్ కూలి ఆర్మీ వాహనం పడటంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అధిక ఎత్తులో ఉన్న వాహనం రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్ప అందిస్తున్నారు.
ప్రమాదం కారణంగా బన్పీలాల్ పేట వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను వేరే దారుల్లోకి మళ్లిస్తున్నారు.
నకిలీ వీసాలు కల్గిన ఏడుగురిని అరెస్ట్ చేసిన డిల్లీ పోలీసులు
నకిలీ వీసా కేసులో పట్టుబడిన ఆంద్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు నిందితులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సిద్ధార్థ, కృష్ణ కిశోర్, విజయ్ జ్ఞానేశ్, నాగ కుమారి, అరుణ్ కుమార్, నాగార్జున, నాగ ప్రసాద్ లు నకిలీ వీసాల ద్వారా ఇటలీ వెళ్లే ప్రయత్నం లో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న నకిలీ వీసాలను స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు, వారిపై ఐపీసీ 420, 468, 471 తో పాటు పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం కేసులు నమోదు చేశారు.