భోజనం తర్వాత అస్సలు చేయకూడని పనులు
భోజనం తర్వాత చల్లటి నీరు తాగితే... డైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. భోజనం అరగకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం మానేయడం మంచిది.
బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తిండి పూర్తిగా తగ్గించేయడం, గంటల తరబడి వ్యాయామం చేయడం లాంటివి ఎన్నో చేస్తారు. అయితే... ఎన్ని చేసినా చాలమంది బరువు మాత్రం తగ్గరు. దానికి కారణం మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తే... బరువు తగ్గడం కష్టమని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనమూ చూద్దాం..
1. నిద్ర... కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఓ చిన్న కునుకు వేస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. నిద్ర కూడా అంతే త్వరగా పడుతుంది. దీంతో చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే.. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అరగకపోవడంతోపాటు... ఇతర సమస్యలు కూడా వస్తాయి. క్యాలరీలు కరగడం లాంటివి కూడా జరగవని చెబుతున్నారు.
2.చల్లటి నీరు... చాలా మంది భోజనం మధ్యలో నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి భోజనం చేసిన వెంటనే మంచినీరు తాగుతారు. ఈ రెండు అలవాట్లు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక చల్లటి నీరు తాగడం మాత్రం ఇంకా ప్రమాదమంటున్నారు. భోజనం తర్వాత చల్లటి నీరు తాగితే... డైజెషన్ సమస్యలు తలెత్తుతాయి. భోజనం అరగకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి భోజనం తర్వాత చల్లటి నీరు తాగడం మానేయడం మంచిది. భోజనం పూర్తైన 15 నిమిషాల తర్వాత మంచినీరు తాగడం ఉత్తమం.
3.ఎక్కువ సేపు కూర్చోవడం... కొందరికో అలవాటు ఉంటుంది. భోజనం పూర్తైన తర్వాత కూడా తిన్న ప్లేటు ముందు నుంచి కదలరు. అలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. భోజనం చేయడం పూర్తవ్వగానే అక్కడి నుంచి లేవాలని చెబుతున్నారు. అలానే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందటున్నారు. అదేవిధంగా భోజనం కూడా ఎక్కువ సేపు తినడం మంచిదికాదని చెబుతున్నారు.
4. స్వీట్లు తినడం... భోజనం చేసిన తర్వాత చాలా మందికి స్వీట్, ఐస్ క్రీమ్, కేక్ లాంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే... ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. వీటిలో కాలరీలు ఎక్కువ ఉంటాయి. దాంతో కొవ్వు కూడా బాగా పేరుకుపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
5.భారీ కసరత్తులు... బరువు త్వరగా తగ్గిపోవాలనే ఆత్రుతలో కొందరు తినగానే భారీ కసరత్తులు చేయడం మొదలుపెడతారు. వ్యాయామం చేయడం మంచిదే కానీ... తినగానే కసరత్తులు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. ఈ ఐదు నియమాలను గుర్తుపెట్టుకొని...వీటిని ఫాలో అయిపోతే..బరువు తగ్గడం చాలా సులభం అవుతుందని చెబుతున్నారు.