Asianet News TeluguAsianet News Telugu

భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో సగం వాటా ఆ రెండింటిదే

గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 50 శాతం వాటాను షియోమీ, శామ్‌సంగ్ సంస్థలు కొట్టేశాయని ఐడీసీ తేల్చింది. $500-$700 సెగ్మెంట్‌లో వన్ ప్లస్ నిలిచింది. $700 దాటిన సెగ్మెంట్లో  యాపిల్ ‘ఐఫోన్’లతో శామ్‌సంగ్  గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లు పోటీ పడ్డాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు.

Just 2 companies control 50% of India's smartphone market
Author
Hyderabad, First Published Mar 12, 2019, 2:21 PM IST

న్యూఢిల్లీ: అయితే శామ్‌సంగ్.. కాదంటే షియోమీ గతేడాది అత్యధికంగా భారత్ స్మార్ట్ ఫోన్ ప్రియుల వద్ద నుంచి వినిపించిన పేరు. భారతదేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 50 శాతానికి పైగా మార్కెట్‌ను తమ సొంతం చేసుకున్నాయి ఈ రెండు కంపెనీలు.

ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించిన నివేదిక మేరకు చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ 2018 భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 28.9 శాతం సొంతం చేసుకున్నది. గతేడాది భారతదేశంలో షియోమీ 142.3 మిలియన్ల ఫోన్లను షియోమీ విక్రయించిందన్న మాట.

శామ్ సంగ్ ఫోన్లు కేవలం 22.4 శాతమే. 2017లో శామ్ సింగ్ 24.7 శాతం ఫోన్లు విక్రయిస్తే, 20.9 శాతం షియోమీ స్మార్ట్ ఫోన్లను భారతీయులు కొన్నారు.  శామ్ సంగ్, షియోమీ తర్వాత 2018లో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ మేజర్లు వివో 14.2 శాతం, ఒప్పో 10.2 శాతం ఫోన్లను విక్రయించాయి.

ఇతర బ్రాండ్ల నుంచి నచ్చిన బ్రాండ్లలోకి మారిన వారి సంఖ్య 6.4 శాతం ఉంటుందని ఐడీసీ నిగ్గు తేల్చింది. శామ్ సంగ్ మినహా మిగతా టాప్ -5లో చైనా కేంద్రంగా తయారవుతున్న స్మార్ట్ ఫోన్లే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. 

ఇదిలా ఉంటే 2018 విక్రయాల్లో ఆన్ లైన్ విక్రయాలే సింహభాగం పొందాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2018లో 38.4 శాతం స్మార్ట్ ఫోన్లు ఆన్ లైన్ లోనే కస్టమర్లు బుక్ చేసుకున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న అత్యధిక రికార్డు. 

భారతీయులంతా ‘మీ’ ఫ్యాన్స్ అని షియోమీ భారత్ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు. దీని క్రెడిట్ అంతా 100 శాతం టీం వర్క్‌దే, ‘మీ’ ఫ్యాన్ ప్రేమికులదరిదని వ్యాఖ్యానించారు. తమకు మద్దతు తెలిపిన ‘మీ’ ఫ్యాన్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  

2018 చివరి త్రైమాసికంలో శామ్‌సంగ్ కంటే 54 శాతం అధికంగా స్మార్ట్‌ఫోన్ విక్రయాలు సాగించిందని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. చైనా వంటి దేశాల్లో యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. 

రూ.35 వేలపై చిలుకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విక్రయాలు భారతదేశ మార్కెట్లో మూడు శాతం తగ్గాయి. ఇతర సెగ్మెంట్ల ఫోన్ విక్రయాలు 43.9 శాతానికి చేరాయని ఐడీసీ తెలిపింది. ‘$500-$700’మధ్య ధర కల సెగ్మెంట్‌లో వన్ ప్లస్ లీడర్ గా నిలిచిందని ఐడీసీ పేర్కొన్నది.  

అయితే $700కంటే ఎక్కువ ధర సెగ్మెంట్ ఫోన్ విభాగంలో యాపిల్ ‘ఐఫోన్’లతో శామ్‌సంగ్  గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లు పోటీ పడ్డాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు. దీనికి తోడు 2018లో కేంద్ర ప్రభుత్వం బయట ఉత్పత్తి చేసిన ఫోన్లపై భారీగా సుంకాలు విధిస్తామని పేర్కొనడంతోపాటు స్థానికంగా ఫోన్లు తయారు చేయడానికి ఆయా స్మార్ట్ ఫోన్ల సంస్థలు ముందుకు వచ్చాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios