పద్మావత్ రిలీజ్ ఆపొద్దంటూ 5 రాష్ట్రాల సర్కార్ లకు సుప్రీం అక్షింతలు
- పలు అభ్యంతరాలతో పద్మావతి చిత్రంపై సెన్సార్ అనుమతుల నిరాకరణ
- వివాదాల అనంతరం సెన్సార్ క్లియరెన్స్, జనవరి 25న రిలీజ్
- పద్మావతి చిత్రం రిలీజ్ ఆపొద్దని 5 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అక్షింతలు
మొదలుపెట్టినప్పటి నుంచి పద్మావతి సినిమా వివాదాల్లో నానుతూనే వుంది. చివరకు టైటిల్ పద్మావత్ గా మార్చి, సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు కొన్ని సీన్స్ కట్ చేసిన తర్వాత జనవరి 25న రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా ‘పద్మావత్’ చిత్రానికి సర్వోన్నత న్యాయస్థానం కూడా ఊరటనిచ్చింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో వివాదాలు ఎదుర్కొని చివరకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమా విడుదలపై నిషేధం విధించాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ‘పద్మావత్’ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం గురువారం తీర్పునిస్తూ ఐదు రాష్ట్రాల్లో సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. దాంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమాలో దీపిక పదుకొణె ఈ సినిమాలో రాణి పద్మావతి పాత్రలో నటించింది. పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్దిన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు.