ప్లాఫ్ ఎఫెక్ట్ :రవితేజతో సినిమాని అర్దాంతరంగా ఆపేసిన నిర్మాతలు
రవితేజ తో సినిమా అంటే ఒకప్పుడు కాసులు పంట. ఆయనతో చేసిన సినిమా ఏదీ ఫ్లాఫ్ అయ్యేది కాదు. జనం కూడా డైరక్టర్ ఎవరు,ప్రొడ్యూసర్ ఎవరు అనేది చూడకుండా రవితేజ సినిమా వస్తోందంటే ఎగబడి చూసేవారు.
రవితేజ తో సినిమా అంటే ఒకప్పుడు కాసులు పంట. ఆయనతో చేసిన సినిమా ఏదీ ఫ్లాఫ్ అయ్యేది కాదు. జనం కూడా డైరక్టర్ ఎవరు,ప్రొడ్యూసర్ ఎవరు అనేది చూడకుండా రవితేజ సినిమా వస్తోందంటే ఎగబడి చూసేవారు. కానీ గత కొంతకాలంగా ఆ పరిస్దితి రివర్స్ అయ్యింది. వరసగా ప్లాఫ్ లు ఆయన్ని పలకరిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో రవితేజ తో సినిమా అనగానే నిర్మాతలకు వణుకు పుడుతోందనే చెప్పాలి. ఈ నేపధ్యంలో ఆయన తో అనుకున్న ప్రాజెక్టుని అర్దాంతరంగా ఆపేసారు నిర్మాతలు.
వివరాల్లోకి వెళితే...మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రవితేజ హీరోగా ఇంకో సినిమా ప్లాన్ చేసారు. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత ఈ సినిమా పట్టాలు ఎక్కాల్సి ఉంది. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు...ఆ ఆలోచనను విరమించుకున్నారు. తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన తేరీ ని రవితేజతో రీమేక్ చేద్దామని రైట్స్ తెచ్చుకున్నారు. మొదట వాళ్లు పవన్ హీరోగా ఆ సినిమా అనుకున్నారు. అయితే ఆయన జనసేన పనుల్లో బిజీగా ఉండటం,ఇప్పుడిప్పుడే సినిమా చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటన చేయటం జరిగింది.
దాంతో ఈ రీమేక్ ని రవితేజతో చేద్దామని మైత్రీ వాళ్లు ఫిక్స్ అవటం...ఆయన ఓకే చెప్పటం జరిగింది. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి డైరక్టర్ గా అనుకున్నారు. ఆయన స్క్రిప్టు మొత్తం రవితేజ ఇమేజ్ కు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్లారు. అయితే అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ తో ప్రొడక్షన్ హౌస్ వాళ్లు...రిస్క్ చేయటం ఇష్టం లేక ఆ ప్రాజెక్టు ఆపేయాలని నిర్ణయం తీసుకుని దర్శకుడుకు చెప్పేసినట్లు సమాచారం.