ఇప్పటికే 130 కోట్లు వసూలు చేసిన రంగస్థలం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.130 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేవలం 7 రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తొమ్మిదో తెలుగు చిత్రంగా నిలిచిందని చెప్పారు.
దీంతోపాటు ‘రంగస్థలం’.. అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా మొత్తం వసూళ్లను కూడా బీట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బన్నీ సినిమా మొత్తం రూ.115 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో మహేశ్బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, పవన్కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాల వసూళ్లను కూడా అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అనసూయ, జగపతిబాబు, ఆదిపినిశెట్టి, ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. 1985 కాలాన్ని తలపిస్తూ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి విమర్శకులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి.