మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిగూడెం పర్యటన.. కారణం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. చిరు సైరా నరసింహారెడ్డి పాత్రలో అదరగొట్టడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చాలా రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
సైరా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయంలో ఇది మెగా అంభిమానులకు మరో శుభవార్త. ఈ నెల 6న చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో పర్యటించనున్నారు. ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం చిరంజీవి తాడేపల్లి గూడెం వెళ్లనున్నారు.
లెజెండ్రీ నటుడు యస్వీ రంగారావు విగ్రహాన్ని తాడేపల్లి గూడెంలో ఆవిష్కరించేందుకు చిరంజీవి వెళ్లనున్నారు. తాడేపల్లి గూడెంలో 6వ తేదీ ఉదయం 10:15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, యస్వీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
వాస్తవానికి కొన్ని వారాల ముందే ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయంలో చిరంజీవి సైరా చిత్ర పనులతో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఎట్టకేలకు చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
యస్వీఆర్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి లాంటి నటులకు ధీటుగా నటించారు. హిరణ్యకశ్యప, ఘటోత్కచుడు లాంటి పౌరాణిక పాత్రలకు ఆయన పెట్టింది పేరు.