నీ పనిపడతా.. సింగర్ చిన్మయికి నిర్మాత వార్నింగ్!
మీటూ వివాదం ప్రారంభమైన నాటి నుంచి గాయిని చిన్మయి రోజూ మీడియాలో ఏదో వార్తలో కనపడుతూనే ఉన్నారు.
మీటూ వివాదం ప్రారంభమైన నాటి నుంచి గాయిని చిన్మయి రోజూ మీడియాలో ఏదో వార్తలో కనపడుతూనే ఉన్నారు. తనకు న్యాయం జరిగేవరకూ విశ్రమించబోను అన్నట్లుగా ఆమె పోరాటం చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఆమెకు కౌంటర్ గా విమర్శలు, ఆరోపణలు, బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా మరోసారి అటువంటి హెచ్చరికనే ఎదుర్కొన్నారు. అదీ బహిరంగంగా స్టేజి పై నుంచి ఓ నిర్మాత చేయటం అందరినీ షాక్ కు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.... నటుడు, నిర్మాత కే.రాజన్ ఇటీవల జరిగిన ఒక తమిళ చిత్ర ఆడియో లాంచ్ వేదికపై ఒక గాయని ప్రఖ్యాత గీతరచయితపై మీటూ ఆరోపణలు చేసిందంటూ చిన్మయి పేరు ఎత్తకుండా కామెంట్స్ చేసారు. ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును, గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇంతటితో ఆపకుండా ఆమె ఇదే విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ పోతే, తాను ఆ గాయని పని పట్టడానికి కొందరిని సిద్ధం చేశానని చెప్పుకొచ్చారు.
అయితే బెదిరింపులకు ట్విట్టర్లో చిన్మయి చాలా సింపుల్గా రిప్లై ఇచ్చారు. చిన్మయి మాటలకు తానిప్పుడు భయపడిపోవాలా? అని పేర్కొన్నారు. దీంతో మీటూ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి రచ్చ చేసే అవకాశం ఉందన్నారు తమిళ సినీ వర్గాలు.
ఇక చిన్మయి ఆ మధ్య మీటూ తో సినీ పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించారు. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె మీటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను వైరముత్తు ఖండించారు. అయితే ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమని చిన్మయి ప్రకటించారు. అదే విధంగా సీనియర్ నటుడు రాధారవిపైనా చిన్మయి ఈ ఆరోపణలే చేశారు. వీరి మధ్య మాటల యుద్ధం ఘాటుగానే సాగింది.