పవన్ కోసం నన్ను సెలెక్ట్ చేసింది సురేఖగారే.. 'రంగస్థలం' అందుకే ఒప్పుకోలేదు!
అందాల తార రాశి అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. 90 దశకం నుంచి 2000 ఆరంభం వరకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. హోమ్లీ హీరోయిన్ గా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది.
రాశి నటించిన ఎన్నో చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. రాశి నటించిన చిత్రాల్లో పండగ, గోకులంలో సీత, దేవుళ్ళు, శుభాకాంక్షలు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు ఉన్నాయి. వివాహం తర్వాత రాశి వెండి తెరకు దూరమయ్యారు. తాజాగా రాశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి అనేక ఆసక్తికర సంగతులు తెలిపారు.
పవన్ కళ్యాణ్, రాశి కాంబినేషన్ లో వచ్చిన గోకులంలో సీత చిత్రం ఒక మెమొరబుల్ హిట్. ఆ చిత్రంలో రాశి అద్భుతంగా నటించింది. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో తనని హీరోయిన్ గా ఎంపిక చేసింది చిరంజీవి సతీమణి సురేఖగారే అని రాశి తెలిపింది.
గోకులంలో సీత చిత్ర ప్రారంభానికి ముందు చిరంజీవిగారి ఇంటి నుంచి పిలుపు వచ్చింది. చిరంజీవిగారు పిలుస్తున్నారేమో అని అనుకుని నా ఆల్బమ్ తీసుకుని మా నాన్నతో వెళ్లాను. కానీ నన్ను పిలిచింది సురేఖ గారు. ఈ అమ్మాయి కళ్యాణ్ బాబు పక్కన గోకులంలో సీత చిత్రంలో చక్కగా సరిపోతుంది. ఫైనల్ చేసేయండి అని చిరంజీవిగారికే చెప్పింది. అలా తనకు గోకులంలో సీత చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని రాశి తెలిపింది.
పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో అన్ని చిత్రాల కార్యక్రమాలని చిరంజీవి, సురేఖ పరిశీలించేవారు. ఇక రాశి మరో విషయాన్ని కూడా తెలియజేసింది. రాంచరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం చిత్రంలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఎంతలా హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ ముందుగా రాశిని అడిగారట. రంగమ్మత్త పాత్ర కోసం నన్ను అడిగారు.
కానీ ఆ చిత్రంలో మోకాళ్ళ పై వరకు చీర కట్టుకుని కొంచెం నాటుగా కనిపించాల్సి ఉంటుంది. అది అద్భుతమైన పాత్రే. కానీ అలా నటించడం నాకు సూట్ కాదని భావించా. అందుకే ఆ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు రాశి తెలిపింది. రంగస్థలం చిత్రంలో అనసూయ కోనసీమ యాసలో నటించి మెప్పించింది.