నాలుగు నెలల్లో నాలుగులక్షల ఉద్యోగాలు...మూర్చరోగిలా మారిన బాబు: జోగి రమేష్
ముఖ్యమంత్రిగా జగన్ చేపడుతున్న పాలనను చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు.
40 ఏళ్లుగా రాజకీయంలో వున్నానని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేవలం నాలుగు నెలల వైఎస్సార్సిపి పాలనతో మార్చరోగం వచ్చినట్లుందని ఎంఎల్ఏ జోగి రమేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబుపై విరుచుకుపడ్డారు.
టిడిపి అధ్యక్షుడు మాత్రమే కాదు ఆ పార్టీ నాయకులంతా మూర్చరోగులవలే ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి భాష విచిత్ర వేషాలు చూస్తే అలాగే అనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు మాటలు విని అలాగే అనుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబును చూసి వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడేవారన్న చంద్రబాబు మాటలను గుర్తుచేశారు. అలాగే జగన్ ఈయనను చూసి భయపడటం లేదని అంటున్నాడని... చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కనీసం ఆయనకైనా తెలుసా అని అని ప్రశ్నించారు.
40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సిఎంగా వున్నానని చెప్పుకునే చంద్రబాబుకు ఎందుకు పిచ్చిపట్టింది. తమ ముఖ్యమంత్రి జగన్ పారదర్శకమైన పరిపాలన చూసి నీకు మూర్చవచ్చిందా...? అని ప్రశ్నించారు.
భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదవి చేపట్టిన నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదని...ఆ ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులలో, వర్క్స్ లో 50 శాతం రిజర్వేషన్ లు కల్పించాం.ఇవన్ని చూసి చంద్రబాబుకు ఆయన తాబేదార్లకు మూర్ఛరోగిలాగా మారిపోయి ఉంటాడని అనుకుంటున్నట్లు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో సైతం రిజర్వేషన్ పాటించాలని జగన్ నిర్ణయించినట్లు తెలిపారు.
ఒక్క బటన్ నొక్కితే లక్షా 73 వేలమంది ఆటో అన్నలకు గంటలో పదివేల రూపాయలు చొప్పున(173 కోట్ల రూపాయలు) అందించిన ఘనత జగన్ దని అన్నారు. కులం,మతం,పార్టీ,రంగు చూడకుండా కేవలం పేదవాడి గుండెచప్పుడు చూసి చెప్పినమాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.