మహాత్మాగాంధీ సిద్దాంతాలే ఆదర్శం... ఇకపై నా లక్ష్యమదే: టిజి. వెంకటేశ్
కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న సంకల్ప యాత్ర గురించి బిజెపి రాజ్యసభ ఎంపీ టిజి వెంకటేశ్ మీడియాకు వివరించారు. ఈ యాత్ర ద్వారా బిజెపి మరింత బలోపేతం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ చెప్పినటువంటి సిద్ధాంతాలను ఆచరించడమే తన లక్ష్యమని బిజెపి నాయకులు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూల్ నగరం లోని స్థానిక అర్య ఫంక్షన్ హాల్లో బిజెపి నేతల విస్తృత స్థాయి సమావేశంతో పాటు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బిజెపిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో సూచించారు.
రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అ పథకాలను రాష్ట్ర ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సంకల్ప యాత్రను ప్రారంభించబోతోందని ప్రకటించారు. ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభించే ఈ యాత్రకు బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంతో ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అమృత పథకం కింద, గృహ నిర్మాణాల కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. అవి ఇంత వరకు పూర్తిగా ప్రజలకు అంద లేదనీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటి మీదా మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందనీ డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు తాను మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను తుచ తప్పకుండా పాటిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ సంజయ్ కుమార్ తో మండలస్థాయి బిజెపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.