Asianet News TeluguAsianet News Telugu

కేరళ ముఖ్యమంత్రితో ఏపి మంత్రి భేటీ... చర్చించిన అంశాలివే

ఏపి నుండి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సమావేశమయ్యారు.   

minister vellampalli srinivas meeting with kerala cm pinarai vijayan about ayyappa devotees
Author
Vijayawada, First Published Nov 5, 2019, 5:08 PM IST

విజయవాడ: శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలను కలిపారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడంపై తిరువనంతపురంలో ఐదు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో కేరళ సీఎం సమావేశమయ్యారని తెలిపారు.  అందులోభాగంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ తో జరిగిన సమావేశం సారాంశాన్ని మంత్రి వివరించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు, వస్తువుల వాడకం పూర్తిగా తగ్గించాలని కేరళ సీఎం కోరినట్లు తెలిపారు. కేరళలో ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు. ఈ సమావేశం ద్వారా కేరళ సీఎం ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధం కు సహకరించాలని కోరారని తెలిపారు. 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాములు కోసం శబరిమలైలో  కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమని కోరినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

read more  తీరు మార్చుకో...లేదంటే రాజకీయాలకే పనికిరాకుండా పోతావ్..: పవన్ కు అవంతి హెచ్చరిక

శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై చర్చించేందకు కేరళ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించిందని తెతిపారు. 

ఈ సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్ మరియు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కటకం సురేందర్ కు మంత్రి వెల్లంపల్లి కొన్ని ప్రతిపాదనలు విన్నవించారు.  అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలని కోరామన్నారు. 

రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో  కలిపి నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థతో  పాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా స్పష్టంగా తెలుగు భాషలో బోర్డులు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. 

నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులకు తాగునీరు భోజన, అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలన్నారు. శబరిమలకు అదనంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

read more పాఠశాలలు, హాస్పిటల్స్ లో నాడు-నేడు... ఏం మారనున్నాయంటే...: జగన్

తన వినతులపై కేరళ సీఎం స్పందిస్తూ... ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ కు అనుసంధానిస్తూ కేరళ లో జాయింట్ గా ఐదు రాష్ట్రాలతో కలిపి సెంట్రల్ హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 

కేరళ సీఎం పినరయితో  పాటు సమావేశానికి వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసినట్లు... వారిని సన్మానించినట్లు మంత్రి తెలిపారు. సమావేశం అనంతరం అనంత పద్మనాభ స్వామి దేవదాయాన్ని మంత్రి దర్శించుకుని ఆశీర్వాదములు తీసుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios