హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు సిపిఐ షాక్: జగన్ చిన్నవాడైనా...
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ఎపి సిఎం వైఎస్ జగన్ చిన్నవాడైనా ఆయన అడుగుజాడల్లో కేసీఆర్ నడవాలని అన్నారు.
ఆదిలాబాద్: హుజూర్ శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు సిపిఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసి సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు.
ఆర్టీసీ సమ్మెకు ముందు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఆయన ఆయన చెప్పారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు వారికి ఉండి పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
ఆర్టీసి కార్మికులు ఆంధ్రోళ్లు కారని, వారిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసి కార్మికుల సమ్మెకు చాడ వెంకట రెడ్డి సంఘీభావం తెలిపారు అంతకు ముందు ఆయన సిపిఐ కార్యాలయంలో మాట్లాడారు.
ఎపిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ చిన్నవాడైనా ఆయన అడుగు జాడల్లో కేసీఆర్ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు. సమ్మె వల్ల మనోవేదనకు గురై ముగ్గురు కార్మికులు మృతి చెందారని, దానికి కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.