పులివెందులపై వరాలు...ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రకటించిన జగన్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులపై వరాల జల్లు కురిపించారు. అతిత్వరలో ఈ నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
అమరావతి: పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్లో తానే స్వయంగా శంఖుస్ధాపన చేయనున్నట్లు వెల్లడించారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (పాడా) పై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవి సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ఏరియా ఆసుపత్రి, వేంపల్లి సిహెచ్సీకి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించారు.
పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీకి సుమారు రూ. 50 కోట్లతో డిపిఆర్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రం పులివెందులకు కొత్త ఫైర్ స్టేషన్ బిల్డింగ్, వేంపల్లికి కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేశారు.
సచివాలయానికి డుమ్మా... మంత్రులపై జగన్ సీరియస్
పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం డిపిఆర్ సిద్దం చేయాలని ఆదేశించారు. నాడు – నేడు పథకం కింద నియోజకవర్గంలోని స్కూళ్ళను రూ. 30 కోట్లతో అభివృద్ది చేయాలని సూచించారు. వేంపల్లిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జెఎన్టీయూ పులివెందులలో కొత్త లెక్చర్ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ది కేంద్రానికి రూ. 10 కోట్ల నిధుల విడుదల చేశారు. సింహద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలకు రూ. 15 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ది చేపట్టనున్నట్లు ప్రకటించారు.
2012–13 రబీ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ భీమా సొమ్ము సుమారు రూ.112 కోట్లు త్వరితగతిన రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల్లోగా రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐసీ ఇన్సురెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం ఆచరణలోకి తీసుకురావాలని సూచించారు.
video news : ఈఆర్సి చైర్మన్ గా హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సీవీ నాగార్జునరెడ్డి
పులివెందుల మార్కెట్యార్డ్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు చేశారు. నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్స్, 1 కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పులివెందుల శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశిచారు. అలాగే వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటకు భూమి గుర్తింపు, నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు.
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట మరియు జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్య్కూట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
వేంపల్లిలో బిసి బాలురు, బాలికల వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయాలని సూచించారు. జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఇందుకు గాను పేరుగాంచిన సంస్ధలను సంప్రదించి ఏర్పాటుచేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పులివెందులలో మాల్ కమ్ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు జగన్ సూచించారు.