దంచి కొట్టిన ఉమేశ్ యాదవ్... ఆనందంతో చిందులు వేసిన కోహ్లీ
ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్ రూంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ పేసర్ ఉమేశ్ యాదవ్... బ్యాట్ తో దంచికొట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతూ 10 బంతుల్లో నే 31 పరగులు చేశాడు. జట్టు స్కోరు పెంచడానికి ఉమేశ్ సహాయపడ్డాడు. కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేయగా... అందులో 5 సిక్సర్లు ఉండటం విశేషం.
ఈ ఐదు సిక్సర్లు స్పిన్నర్ లిండే బౌలింగ్లోనే బాదడం విశేషం. అయితే చివరికి అతని బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. ఆపై భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 497/9వద్ద డిక్లేర్డ్ చేసింది.రవీంద్ర జడేజా ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. వచ్చీ రావడంతోనే పరుగుల వరద పారించాడు. జార్జ్ లిండే వేసిన 112 ఓవర్లోని ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు.
ఇక లిండే వేసిన 114 ఓవర్ తొలి బంతి, మూడో బంతి, ఐదో బంతిని సిక్స్ కొట్టాడు. ఇదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి.. ఆ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. బంతి గాల్లోకి లేవగా కీపర్ సునాయాస క్యాచ్ అందుకోవడంతో ఉమేష్ చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్ చేరాడు.
ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్ రూంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ఉమేశ్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. ఎంత దూరం వెళ్లిందో చూడండి అంటూ కోహ్లీ సహచరులతో అన్నాడు. ఇక ఉమేశ్ ఔట్ అయి డ్రెస్సింగ్ రూంలోకి రాగానే కోహ్లీ అతని చూస్తూ వావ్ అంటూ అభినందించాడు.
ఉమేశ్ బ్యాటింగ్ కి.... కోహ్లీ చిందులు వేస్తున్న వీడియోని బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేయగా... ఆ వీడియోలు వైరల్ గా మారాయి.