టీమిండియా డ్రెసింగ్ రూంలో ధోనీ: విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదీ...
క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఎంఎస్ ధోనీ అకస్మాత్తుగా రాంచీలోని టీమిండియా డ్రెసింగ్ రూంలో దర్శనమిచ్చాడు. మరో రాంచీ క్రికెటర్ నదీమ్ తో మాట్లాడాడు. ధోనీ రాకపై రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కూడా స్పందించారు.
రాంచీ: టెస్టు క్రికెట్ కు దూరమైన రాంచీ ముద్దు బిడ్డ ఎంఎస్ ధోనీ టీమిండియా డ్రెసింగ్ రూంలో దర్శనమిచ్చాడు. జెఎస్ సీఎ స్టేడింయలోని టీమిండియా డ్రెసింగ్ రూంలోకి ఆయన అడుగు పెట్టాడు. దక్షిణాఫ్రికాపై మూడో టెస్టు మ్యాచ్ నాలుగో రోజున ఆయన ఇక్కడికి వచ్చాడు.
మరో జార్ఖండ్ క్రికెటర్ షాబాడ్ నదీంతో ధోనీ మాట్లాడుతూ అతన్ని ప్రోత్సహిస్తుండడం కనిపించింది. దక్షిణాఫ్రికాపై జరిగిన మూడో టెస్టులో ఆరంగేట్రం చేసిన నదీమ్ నాలుగు వికెట్లు తీసి తన సత్తా చాటాడు.
మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభమైన పది నిమిషాలకే భారత్ లాంఛనం పూర్తి చేసింది. దక్షిణాఫ్రికాపై ధోనీ సమక్షంలో టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది. 12 బంతుల్లో భారత్ దక్షిణాఫ్రికా వికెట్లు పడగొట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. నదీమ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీతో ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు. అద్భుతమైన సిరీస్ విజయం తర్వాత నిజమైన ఇండియన్ లెజెండ్ ను తన డెన్ లో చూడడం గొప్పగా ఉందని రవిశాస్త్రి ఆ ఫొటోకు శీర్షిక పెట్టాడు.
ధోనీపై మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. మీరు వచ్చి ధోనీకి హలో చెప్పండని ఆయన రిపోర్టర్లతో అన్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోనీ 2014లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఐసిసి ప్రపంచ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ నుంచి భారత్ వెనుదిరిగిన తర్వాత క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు.