హెచ్సీఏ అధ్యక్షపీఠం అజారుద్దిన్దే... 147 ఓట్లతో ఘన విజయం
టీమిండియా మాజీ ఆటగాడు అజారుద్దిన్ హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికోసం పోటీపడ్డ అతడు తాజాగా ప్రకటించిన ఫలితాల్లో విజేతగా నిలిచారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ టీమిండియా కెప్టెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలవ్వగా అజార్ కు 147 ఓట్లు వచ్చాయి. ప్రకాశ్ జైన్కు 73, దిలీప్ కుమార్కు 3 ఓట్లు పడ్డాయి. దీంతో దాదాపు సగానికి పైగా ఓట్లను దక్కించుకున్న అజారుద్దిన్ 74 ఓట్ల తేడాతొ విజయకేతనం ఎగరేశాడు. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల పలితాలను ప్రకటించారు.
ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికోసం ముగ్గురు చివరిపోటీలో నిలిచారు. అయితే వీరిలో అజారుద్దిన్, ప్రకాష్చంద్ జైన్ ల మధ్యే ప్రధాన పోటీ సాగింది. అయితే మాజీ హెచ్సీఏ అధ్యక్షులు వివేక్ ఈ పోటీకి అనర్హుడిగా తేలడంతో అతడు ప్రకాష్చంద్ జైన్ ప్యానల్ కు మద్దతుగా నిలిచాడు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ అజారుద్దిన్ కు సపోర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే ఇవాళ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగింది. ఇందులో వివిధ పదవుల కోసం మొత్తం 17 మంది పోటీపడ్డారు. ముందుగా అధ్యక్ష పదవిని నిర్ణయించే ఓట్లను లెక్కించగా అజారుద్దిన్ ఆధిపత్యం కొనసాగింది. దీంతో హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా అజారుద్దిన్ ఎన్నికయ్యారు.
సంబంధిత వార్తలు
ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు... సాయంత్రమే తేలనున్న అజారుద్దిన్ భవితవ్యం