అందుకే బజ్జీని పక్కన పెట్టాం: ధోనీ కీలక వ్యాఖ్యలు
బౌలర్లను రొటేట్ చేసుకోగలిగామని, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చాలా బాగా బౌలింగ్ చేశాడని ధోనీ అన్నారు. రిస్ట్ స్పిన్నర్ అయి ఉండి కూడా తనలా బౌలింగ్ చేసిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన చెప్పారు.
చెన్నై : రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచుకు తుది జట్టులోకి స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీసుకోకపోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించారు. జడేజా, సాంట్నర్ బంతిపై గ్రిప్ సాధించలేకపోయారని, వారిద్దరు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
అయితే బౌలర్లను రొటేట్ చేసుకోగలిగామని, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చాలా బాగా బౌలింగ్ చేశాడని ధోనీ అన్నారు. రిస్ట్ స్పిన్నర్ అయి ఉండి కూడా తనలా బౌలింగ్ చేసిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన చెప్పారు.
ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. ఇందులో భాగంగా రాహుల్ త్రిపాఠి, స్మిత్లను పెవిలియన్కు చేర్చిన చెన్నై బౌలర్ తాహిర్ పర్పుల్ క్యాప్(మూడు మ్యాచుల్లో 6 వికెట్లు) దక్కించుకున్నాడు.
తమ జట్టులో పదకొండు మంది నిలకడగా ఆడేవాళ్లేనని ఆయన మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నారు. అయితే రాయల్స్ జట్టులో రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఉన్నారని, అందుకే హర్భజన్ను పక్కన పెట్టి సాంట్నర్కు అవకాశం ఇచ్చామని చెప్పారు. అంతేతప్ప జట్టులో ప్రతీసారి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
టోర్నమెంట్ మొత్తం కూడా ప్రత్యర్థి జట్ల బలాలు, బలహీనతల ఆధారంగా జట్టులోని ప్రతీ సభ్యుడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని అన్నారు.