Asianet News TeluguAsianet News Telugu

‘జెట్ ఎయిర్వేస్’ టేకోవర్‌పై లుఫ్తాన్సా, సింగపూర్ ఫోకస్

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ జెట్‌ ఎయిర్వేస్ ‘టేకోవర్’ కోసం ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం బిడ్లను ఆహ్వానించింది. 
 

SBI seeks bids for cash-strapped Jet Airways
Author
Hyderabad, First Published Apr 9, 2019, 11:37 AM IST

న్యూఢిల్లీ/ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం చేతికి చిక్కిన ప్రైవేట్ విమాన యాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’లో వాటాల కొనుగోలుపై ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్, స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ వంటి వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో పాటు కేకేఆర్, బ్లాక్‌స్టోన్, టీపీజీ క్యాపిటల్‌ వంటి ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఎస్బీఐ కన్సార్షియం ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయంపై టాటా గ్రూప్, టీపీజీ క్యాపిటల్‌ వంటి సంస్థలతోనూ చర్చించింది. మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయ ప్రక్రియ మొదలైంది. బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ సోమవారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్లు (ఎస్‌ఐ), ఆర్థిక ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐ) నుంచి బిడ్లను ఆహ్వానించింది. 

నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి జెట్ ఎయిర్వేస్ సంస్థలో కనిష్టంగా 3.54 కోట్ల షేర్లు (సుమారు 31.2 %వాటాలు) నుంచి గరిష్టంగా 8.51 కోట్ల దాకా షేర్ల (75 %వాటాలు) విక్రయానికి అవకాశం ఉంది. బుధవారం లోగా బిడ్లు దాఖలు చేసిన వారు ఈ నెలాఖరులోగా తుది బిడ్‌ దాఖలు చేయాలి.  

కాగా ఎస్బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సంస్థ ఈ బిడ్డింగ్‌ నిర్వహణలో తోడ్పాటు అందించనుంది.దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో విఫలం అవుతోంది. సిబ్బంది జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేక సతమతమవుతోంది. 

నిధుల్లేక పలు విమానాలను నిలిపేసింది. ఈ నేపథ్యంలో రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఎయిర్‌లైన్‌ నియంత్రణను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. గత నెల 25న జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం సంస్థలో మెజారిటీ వాటాలు బ్యాంకుల చేతికి వచ్చాయి. 

కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ నరేష్‌ గోయల్, ఆయన భార్య జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి నిష్క్రమించారు. దీంతో సంస్థలో వారి వాటా గతంలో ఉన్న 51% నుంచి 25 శాతానికి తగ్గింది. ఇక, జెట్‌ కుప్పకూలకుండా యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించేందుకు బ్యాంకులు సుమారు రూ. 1,500 కోట్లు సమకూర్చనున్నాయి.  

ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం ప్రకటన ప్రకారం రుణ భారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న జెట్ ఎయిర్వేస్ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ విక్రయం చేపట్టామని, ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) రూపకల్పన, సమర్పణకు అన్ని వ్యయాలను బిడ్డర్సే భరించాల్సి ఉంటుందని ఎస్బీఐ ప్రకటన పేర్కొంది.

దేశ, విదేశాల్లో ఇదే తరహా రంగాల్లో అనుభవం గల కార్పొరేట్లు వ్యూహాత్మక ఇన్వెస్టర్స్‌ (ఎస్‌ఐ) కేటగిరీ కింద బిడ్స్‌ వేయొచ్చు. ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ మొదలైన వాటిని ఎఫ్‌ఐల కేటగిరీ కింద వర్గీకరించారు. ఎస్‌ఐలకు ఏవియేషన్‌ వ్యాపారంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. 

సదరు విమానయాన సంస్థలు, ఇన్వెస్టర్లు కన్సార్షియంగా ఏర్పడి బిడ్స్‌ వేస్తే .. అందులో ముగ్గురు సభ్యులకు మించి ఉండకూడదు. కన్సార్షియంలో ఒక్కొక్కరి వాటా 15 శాతానికి పైబడే ఉండాలి. సోమవారం బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ 3% పెరిగి రూ. 264.10 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios