Asianet News TeluguAsianet News Telugu

‘జీ’పై రిలయన్స్ జియో ‘ఐ’

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు భారత బిలియనీర్ ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో అడుగేస్తున్నా కొద్దీ అవకాశాలు దూసుకొస్తున్నాయి. టెలికం రంగంలో అడుగు పెట్టేనాటికి జియోకు మౌలిక వసతుల్లేకున్నా అనిల్ అంబానీ అండతో ఇతర టెలికం ప్రొవైడర్లను షేక్ చేసింది. తాజాగా ఈ-కామర్స్, వినోద రంగాల్లో ప్రవేశానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ ఎంటర్‌టైన్మెంట్ వాటాల కొనుగోలుకు అవకాశం వచ్చింది. 

Reliance Jio's interest to heat up race for Zee Entertainment stake
Author
Hyderabad, First Published Jan 29, 2019, 2:48 PM IST

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై (జీల్‌) టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో కన్నేసింది. చౌక చార్జీలతో టెలికం రంగాన్ని కుదిపేసిన జియో తాజాగా మీడియా కంటెంట్‌ విషయంలోనూ ఆధిపత్యం సాధనకు వ్యూహాలు రచిస్తోంది. దీన్లో భాగంగా ‘జీల్‌’లో వాటాల కొనుగోలుపై దృష్టి సారిస్తోంది.

ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్రకు జీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలో గల వాటాల్లో సగభాగం కొనుగోలుకు బరిలోకి దిగాలని జియో యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా అంతర్జాతీయ సంస్థలతోనే జట్టు కడతామంటూ వచిన జీల్‌ ప్రమోటర్లు... తాజాగా దేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పడంతో జియో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

ఇప్పటికే అమెజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) అంతర్జాతీయ దిగ్గజాలు రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్‌టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్‌ పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.  

దీర్ఘకాలికంగా జీల్‌కు మరింత విలువ తెచ్చిపెట్టేలా కంపెనీని తీర్చిదిద్దగలిగే సామర్థ్యం గల అంతర్జాతీయ సంస్థలకు సగం వాటా దాకా విక్రయించేందుకు సిద్ధమని గతేడాది నవంబర్‌లోనే సుభాష్‌ చంద్ర ప్రకటించారు. కాకపోతే, దేశీ ఇన్వెస్టర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇటీవల జీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునీత్‌ గోయెంకా చెప్పారు.

ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు కూడా మొదలెట్టామని, మరికొద్ది వారాల్లో డీల్‌ ప్రకటించే అవకాశం ఉందని జీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పునీత్‌ గోయెంకా తెలిపారు. దీంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో వంటి దేశీ దిగ్గజాలు కూడా జీల్‌పై దృష్టి సారిస్తున్నాయి.  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇప్పటికే పలు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. నెట్‌వర్క్‌18లో 75 శాతం వాటాలు కొనుగోలు చేశారు. న్యూస్‌ విభాగంలో సీఎన్‌ఎన్‌–న్యూస్‌18, సీఎన్‌బీసీ–టీవీ18, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో వయాకామ్‌ 18తో పాటు సినిమాల నిర్మాణ సంస్థ వయాకామ్‌18 మోషన్‌ పిక్చర్స్‌ వంటి వాటిలో ముకేశ్ అంబానీ పెట్టుబడులు పెట్టారు. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్‌ సహా పలు భారతీయ భాషల్లో డిజిటల్, పబ్లిషింగ్‌ సంస్థలూ ఇందులో ఉన్నాయి. 

రామోజీరావుకు చెందిన ఈటీవీ వివిధ భాషల్లో ఆరంభించిన న్యూస్‌ ఛానెళ్లు కూడా ప్రస్తుతం నెట్‌వర్క్‌–18 చేతిలోనే ఉన్నాయి. 2017 జూలైలో కంటెంట్‌ ప్రొడక్షన్‌ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్‌లో రిలయన్స్‌ 24.9 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ సంస్థకి ఆల్ట్‌బాలాజీ పేరుతో ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) యాప్‌ కూడా ఉంది. ఇక ఇప్పుడు జీల్‌లో కూడా వాటాలు కొనుగోలు చేస్తే ఓటీటీ, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగంలో రిలయన్స్‌ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, దేశీయ నెట్‌ఫ్లిక్స్‌గా ఎదిగేందుకు రిలయన్స్‌ చేస్తున్న ప్రయత్నాలకు మరింత దన్ను లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

ప్రస్తుతం జీల్‌లో సుభాష్‌ చంద్ర, ఆయన కుటుంబానికి 41% వాటాలు ఉండగా, 20 శాతం వాటాలను విక్రయించాలని ఆయన భావిస్తున్నారు. వాటాల విక్రయ వార్తలతో డిసెంబర్‌లో జీల్‌ షేరు రూ.500 స్థాయికి ఎగియడంతో వీటి విలువ రూ.10,000 కోట్లకు ఎగిసింది. 

శుక్రవారం ప్రతికూల వార్తలతో జీల్‌ షేరు ఏకంగా 26% పతనం కావడంతో ఆ రోజు లెక్కల ప్రకారం 20 శాతం వాటాలకు సుభాష్‌ చంద్రకు రూ. 7,000 కోట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది డిసెంబర్‌ నాటి విలువతో పోలిస్తే 30 శాతం తక్కువ. 

సోమవారం షేరు కోలుకోవడంతో విలువ మళ్లీ కొంత మేర పెరిగిందని, రూ.8వేల కోట్ల దరిదాపుల్లో ఉందని  మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే రుణాల చెల్లింపు అంశానికి సంబంధించి జీల్‌ మాతృసంస్థ ఎస్సెల్‌ గ్రూప్, బ్యాంకర్ల మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం సంస్థ షేరు ఎగిసింది. ఒప్పందం ప్రకారం.. తనఖాలోని ప్రమోటర్ల షేర్లను మూడు నెలల దాకా విక్రయించబోమని, ధర తగ్గినా దీనికి కట్టుబడి ఉంటామని బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు భరోసా ఇచ్చాయి. 

ఈ లోగా జీల్‌లో వాటాలతో పాటు ఇన్‌ఫ్రా అసెట్స్‌ మొదలైన వాటిని విక్రయించడం ద్వారా ఎస్సెల్‌ గ్రూప్‌ దశలవారీగా రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం గణాంకాల ప్రకారం.. జీల్‌ మార్కెట్‌ విలువ రూ. 30,673 కోట్లు కాగా.. రూ.7,580 కోట్ల విలువ చేసే షేర్లు తనఖాలో ఉన్నాయి. 

నోట్ల రద్దు తర్వాత గ్రూప్‌ సంస్థల సందేహాస్పద డిపాజిట్లపై విచారణ జరుగుతోందన్న వార్తలను కంపెనీ ఖండించింది. ఈ సానుకూల అంశాలతో సోమవారం జీల్‌ షేరు ఏకంగా 17 శాతం ఎగిసి రూ. 372.50 వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో ఒక దశలో 19 శాతం కూడా పెరిగి రూ. 380.80 స్థాయిని తాకింది. ప్రతికూల వార్తల మధ్య జీల్‌ షేరు శుక్రవారం ఏకంగా 26 శాతం పతనమైన సంగతి తెలిసిందే.

ఇంటర్నెట్‌ ద్వారా జరిగే మీడియా కంటెంట్‌ ప్రసారాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు. 2018లో దేశీ ఓటీటీ మార్కెట్‌ రూ.3,500 కోట్లుగా ఉంది. 2023 నాటికి ఇది పది రెట్లు అభివృద్ధి చెంది రూ. 35వేల కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో 40% వాటాతో హాట్‌స్టార్‌ అగ్రస్థానంలో ఉండగా, జియో టీవీ 18% వాటాతో రెండో స్థానంలో ఉంది. జీ గ్రూప్‌కు చెందిన జీ5కి 15%, వూట్‌ (వయాకామ్‌18)కి 12 శాతం, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకి 1.43 శాతం, నెట్‌ఫ్లిక్స్‌కు 2 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios