నాలుగేళ్లలో ఇంటి నుంచే ఆర్డర్లు: రిలయన్స్ కిరాణ డిజిటలైజేషన్ ఎఫెక్ట్
భారతీయ కుటేరుడు ముకేశ్ అంబానీ చర్య భవిష్యత్ కిరాణా వ్యాపార ద్రుక్పథాన్నే మార్చేయనున్నది. 2023 నాటికి 50లక్షల కిరాణా దుకాణాల డిజిటలైజేషన్ చేయాలని రిలయన్స్ డిజిటల్ లక్ష్యంగా ముందుకు వెళుతుంది. అదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్-ఆఫ్లైన్ ఈ-కామర్స్ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు పడనున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో అంటే 2023 నాటికి 50లక్షల రిలయన్స్ రిటైల్ స్టోర్లు పూర్తి డిజిటల్ దుకాణాలుగా మారనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భారతీయ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ త్వరలోనే ఆన్లైన్ రిటైల్ రంగంలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే 15వేల రిలయన్స్ రిటైల్ దుకాణాలు పూర్తి స్థాయి డిజిటలైజేషన్తో పని చేస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 90శాతం అంటే 700 బిలియన్ డాలర్ల రిటైల్ మార్కెట్ వ్యవస్థీకృతంగా లేదు.
తమ ఇంటి పక్కన దుకాణంలోకి వెళ్లి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి తెచ్చుకునే వారి సంఖ్యే ఎక్కువ. భవిష్యత్లో ఇవన్నీ ఆధునీకరించబడతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అధ్యయనం తెలిపింది.
‘ఆధునిక వాణిజ్య, ఆ-కామర్స్ వ్యాపార రంగంలో ఇది పోటీకి దోహదపడుతుంది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు చేయడం వల్ల అందుకు తగిన విధంగా బిల్లులు ఇవ్వాలంటే తప్పకుండా ఆధునీకరించాల్సి ఉంటుంది’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ నివేదిక తెలిపింది.
దేశ వ్యాప్తంగా 10వేల రిలయన్స్ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆన్లైన్ టు ఆఫ్లైన్ ఈ-కామర్స్ వేదికను ఏర్పాటు చేయాలని చూస్తోంది. రిలయన్స్ దుకాణాల్లో అత్యధిక వేగం కలిగిన 4జీ జియో ఎంపీఓఎస్ (మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్) పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా సమీపంలోని దుకాణదారులు వినియోగదారులకు కావాల్సిన వస్తువులను వేగంగా అందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది.
స్నాప్బిజ్, నుక్కడ్ షాప్స్, గోఫ్రుగల్లు ఎపీఓఎస్లను అందిస్తున్నాయి. కాగా, స్నాప్బిజ్ ఒక్కో మెషీన్కు ఒకసారి పెట్టుబడిగా రూ.50వేలు పెట్టాల్సి వస్తుండగా, రిలయన్స్ జియో ఎంపీఓఎస్ కేవలం రూ.3వేలకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా నుక్కడ్ షాప్స్ ఇందుకోసం రూ.30వేల నుంచి రూ.55వేలు, గోఫ్రుగల్ రూ.15వేల నుంచి రూ.లక్ష వరకూ ఎంపీఓఎస్కు తీసుకుంటున్నాయి.