Asianet News TeluguAsianet News Telugu

న్యూఇయర్ డే నుంచి ‘చిప్ కార్డ్’ ఉంటేనే ‘మనీ’

గడువు ముంచుకొస్తోంది. నూతన సంవత్సరం తొలి రోజు నుంచే చిప్ కార్డ్ ఆధారిత డెబిట్ కార్డుల వినియోగం అమలులోకి రానున్నది. ఒకవేళ ఇప్పటికీ చిప్ కార్డులు తీసుకోని బ్యాంకుల ఖాతాదారులు తక్షణం తమ బ్రాంచ్ శాఖల్లో చిప్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐతోపాటు ఆయా బ్యాంకులు ఖాతాదారులకు ఎస్సెమ్మెస్ సందేశాలు పంపాయి. 

Old magstripe debit, credit cards will be invalid in 10 days
Author
New Delhi, First Published Dec 23, 2018, 11:46 AM IST

ఇప్పటి వరకు బ్యాంకింగ్ లావాదేవీల్లో మాగ్నటిక్ స్టిప్ డెబిట్‌/క్రెడిట్‌కార్డ్‌ వల్లే మోసాలు అధికంగా జరుగుతున్నాయి. మోసగాళ్లకు వీటి నుంచి డేటా సేకరించడం సులభం కావడంతో, స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ ద్వారా నకిలీ కార్డులు సృష్టించి నగదు అపహరిస్తున్నారు. కార్డులు పోగొట్టుకున్నపుడు, వాటిని ఉపయోగించి ఖాతాల నుంచి నగదు తీసేస్తున్నవారు అనేకం. 

రోజురోజుకు ఇలాంటి కేసులు పెరగడంతో చిప్‌ ఆధారిత కార్డులు జారీ చేయాలని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి ఒకటో తేదీ నుంచినుంచి చిప్‌ ఆధారిత డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మాత్రమే పని చేస్తాయి. మాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడి కార్డులు కల వారంతా తప్పనిసరిగా తమ కార్డులను మార్చుకోవాల్సిందే సుమా.

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వినియోగం నానాటికీ పెరుగుతోంది. మనం జరిపే ప్రతి లావాదేవీ వివరాలు మనకు తెలియాలంటే బ్యాంక్‌ ఖాతాకు మొబైల్‌ నంబర్అనుసంధానించడం తప్పనిసరి. దీంతోపాటు లావాదేవీల్లో పారదర్శకత కోసం శాశ్వతఖాతా సంఖ్య (పాన్‌)ను జతచేయాల్సిందే. ఇవి జతచేస్తేనే కొత్త చిప్‌కార్డును పొందడం వీలవుతుంది.

యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా (ఈఎంవీ) చిప్‌, పిన్‌ (పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌) ఆధారిత డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మాత్రమే 2019 జనవరి ఒకటో తేదీ నుంచి పనిచేస్తాయని ఇప్పటికే ఆర్బీఐ స్పష్టం చేసింది.

అందువల్ల మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడిన పాత కార్డులను ఈనెల 31వ తేదీలోగా మార్చుకోవాలి. కొత్త కార్డులను జారీ చేయడానికి బ్యాంకులు ఎటువంటి రుసుము వసూలు చేయవు.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వినియోగదారుడి సమాచారం కార్డు వెనుక నల్లరంగులో ఉండే స్ట్రిప్‌లో శాశ్వతంగా మారకుండా ఉంటుంది.

అందువల్ల వివరాలు సేకరించడం మోసగాళ్లకు సులువవుతుంది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల వద్ద వీటిని స్వైప్‌ చేస్తే, చెల్లింపు పూర్తవుతుంది. ఈఎంవీ కార్డుల్లో కూడా సమాచారం డైనమిక్‌గా ఉంటుంది.

ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌లో సమాచారం నిల్వ ఉంటుంది. ప్రతి లావాదేవీకి వివరాలు మారుతుంటాయి. అందువల్ల మోసం చేయడం చాలా కష్టం. ఈ కార్డులను మోసగాళ్లు క్లోనింగ్‌ చేయలేరు. ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మింగ్‌ యంత్రాలను ఉంచి, డేటాను అపహరించడం కూడా కష్టమవుతుంది. పీఓఎస్‌లలో వీటిని ఉంచి, పిన్‌ను నొక్కితే కానీ, చెల్లింపు పూర్తి కాదు.

పాత డెబిట్, క్రెడిట్ కార్డులను ఈ నెలాఖరులోగా మార్చుకోవాలని బ్యాంకులు ఇప్పటికే తమ ఎస్సెమ్మెస్ లు పంపాయి. అంతర్జాతీయంగా వినియోగించే కార్డులు కూడా మార్చుకోవాల్సిందే.

ఈఎంవీ చిప్‌ కార్డులు 2016 జనవరి నుంచి అందుబాటులోకి వచ్చాయి. 2016 జనవరి 31 తరువాత నుంచి కొత్తగా బ్యాంక్‌ ఖాతా తెరిచిన వారికి, కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జారీ చేస్తున్న కార్డులు చిప్‌తోనే ఉంటున్నాయి. 

డేటా ఎన్‌క్రిప్షన్‌ మరింత ఉన్నత ప్రమాణాలతో ఉండటం చిప్‌, పిన్‌ ఆధారిత కార్డులతో సాధ్యమవుతుంది. డేటా నిల్వ సాంకేతికత కూడా మెరుగవుతుంది. అయితే కార్డు సంఖ్య, సీవీవీ వంటి వివరాలతో పాటు మొబైల్‌కు వచ్చే ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వంటివి చెబితే, ఆన్‌లైన్‌ లావాదేవీ పూర్తి చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందని గుర్తించడంతోపాటు ఈ వివరాలు ఎవరికీ తెలియనీయకుండా ఉంచాలి.

మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుల్లో ఇప్పటివరకు 50-70 శాతం వరకు మాత్రమే ఆయా బ్యాంకులు మార్చినట్లు సమాచారం. ఖాతాదారులు కూడా సమయం ఉందని వాయిదా వేయడం మరో కారణం. గడువు మరో వారం రోజులే ఉండటంతో ఇప్పుడు హడావుడి పడుతూ ఆందోళనకు గురవుతున్నారు.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) మాత్రం, తన ఖాతాదారులు గత 12 నెలల్లో ఒక్కసారైనా, మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుతో లావాదేవీ నిర్వహించి ఉంటే, వారికి కొత్త చిప్‌ కార్డును ఇప్పటికే వారి నమోదిత చిరునామాకు పంపింది.

ఏడాది కాలంగా కార్డును ఒక్కసారీ వాడకపోతే మాత్రం, ఖాతాదారులు తమ శాఖను సంప్రదించి, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ను వినియోగదారులు లాగిన్‌ అయి, ఇ-సేవల్లో, ఏటీఎం విభాగానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్‌ నంబర్, పాన్‌ నెంబర్ ఖాతాకు జతయి ఉంటేనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం వీలవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios