అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి షురూ.. ఆయనకే తొలి శుభలేఖ
ముకేశ్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. వచ్చేనెల తొమ్మిదో తేదీన ఆయన పెద్దకొడుకు ఆకాశ్ అంబానీ, ఆయన బాల్య స్నేహితురాలు శ్లోకా మెహతా వివాహం జరుగనున్నది. ఈ వివాహ వేడుకల క్రతువు ప్రారంభమైంది.
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ క్రతువు మొదలైంది. వచ్చేనెలలో ఆకాశ్ అంబానీ- వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం జరుగనున్నది. వీరి నిశ్చితార్థం గతేడాది జూన్లో జరిగిన సంగతి తెలిసిందే.
తొమ్మిదో తేదీ నుంచి ఆకాశ్ వివాహ వేడుకలు మొదలు
ఈ నేపథ్యంలో వచ్చే నెల తొమ్మిదో తేదీ నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్ సెంటర్ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
సిద్ధి వినాయకుడికి ముకేశ్ దంపతుల ప్రత్యేక పూజలు
ఈ నేపథ్యంలో అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్- శ్లోకాల వివాహ ఆహ్వాన మొదటి పత్రికను గణనాథుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిద్ధి వినాయక ఆలయంలో పూజలతోనే ఈశా వివాహ వేడుకలు మొదలు కాగా అంబానీల ఆడపడుచు ఇషా అంబానీ వివాహం గతేడాది డిసెంబర్ నెలలో పిరమిల్ గ్రూపు వారసుడు ఆనంద్ పిరమాల్తో జరిగిన సంగతి తెలిసిందే. ఇషా- ఆనంద్ల వివాహ ఆహ్వాన తొలి పత్రికను కూడా ఇక్కడే ఉంచి పూజలు నిర్వహించారు.
స్టాలిన్ ను కలిసిన ముకేశ్ దంపతులు
ముకేశ్ అంబానీ దంపతులు సోమవారం సాయంత్రం చెన్నైలోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను కలుసుకున్నారు. తమ కుమారుడు ఆకాశ్ - శ్లోకా మెహతా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్, ముకేశ్ దంపతుల మధ్య కొద్దిసేపు వివిధ అంశాలపై ఇష్టాగోష్టి చర్చలు జరిగాయి. కాగా, వివాహ వేడుకలకు ముందు ఆకాశ్ అంబానీ తన స్నేహితులకు ఈ నెల 23-25 తేదీల్లో స్విట్జర్లాండ్లో బ్యాచిలర్ పార్టీ ఇవ్వనున్నారు.