Asianet News TeluguAsianet News Telugu

అత్యంత సిరిమంతుడు ముకేశ్ అంబానీ.. తర్వాత హిందుజా

రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ విలువ రూ.3,74,518 కోట్లు. కానీ.. అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపద విలువ రూ.3,80,700 కోట్లు!! ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానంలో హిందుజా కుటుంబం నిలిచింది. విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ మూడో స్థానం పొందారు. పాతిక మంది వద్దే 10 శాతం దేశ సంపద సమీక్రుతమైంది.

Mukesh Ambani tops list of richest Indians for 8th consecutive year with Rs 380,700 crore net worth
Author
Hyderabad, First Published Sep 26, 2019, 12:29 PM IST

ముంబై: భారతదేశంలోని అత్యంత శ్రీమంతుల్లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఒకటో సారి కాదు.. రెండోసారి కాదు.. వరుసగా ఎనిమిదోసారి ఆయనే నెంబర్‌ వన్‌ సంపన్నుడిగా స్థానం దక్కించుకోవడం విశేషం.

ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ పేరుతో విడుదల చేసిన సంపన్నుల జాబితా ప్రకారం ముకేశ్‌ అంబానీ సంపద రూ.3,80,700 కోట్లు. రూ.1,000 కోట్లకు పైగా నెట్‌వర్త్‌ కలిగిన భారతీయులతో ఐఐఎఫ్ఎల్‌ ఈ జాబితాను రూపొందించింది

స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన కంపెనీలను నిర్వహిస్తున్న వారితో పాటు వ్యక్తిగతంగా వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్న వారితో ఈ జాబితాను తయారు చేసింది. లండన్‌కు చెందిన ఎస్‌పీ హిందూజా అండ్‌ ఫ్యామిలీ రూ.1,86,500 కోట్ల సంపదతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. రూ.1,17,100 కోట్లతో మూడో స్థానంలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ నిలిచారు.

నాలుగో స్థానంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ చైర్మన్‌, సీఈఓ ఎల్‌ఎన్‌ మిట్టల్‌ సంపదరూ.1,07,300 కోట్లు, ఐదో స్థానంలో గౌతమ్‌ అదానీ ఆస్తి రూ.94,500 కోట్లు, ఆరో స్థానంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సారథి ఉదయ్‌ కోటక్‌ ఆస్తి రూ.94,100 కోట్లుగా ఉంది.

ఏడో స్థానంలో సైరస్‌ మిస్ర్తీ ఆస్తి రూ.88,800 కోట్లు, ఎనిమిదో స్థానంలో సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ ఆస్తి రూ.76,800 కోట్లు, తొమ్మిదో స్థానంలో షాపూర్జీ పల్లోంజీ ఆస్తి రూ.76,800 కోట్లు, పదో స్థానంలో సన్‌ ఫార్మాసూటికల్స్‌ వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వీ ఆస్తి రూ.71,500 కోట్లుగా నమోదైంది.

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అన్ని రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. టాప్‌ 100లో ఐదుగురు తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారు.

ఐఐఎఫ్ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ అధ్యయనం ప్రకారం.. దేశంలో 2018లో రూ.1,000 కోట్లకు పైగా నికర విలువ కలిగిన సంపన్నులు 831 మంది. కానీ 2019లో వీరి సంఖ్య 953కు పెరిగింది. అమెరికా డాలర్‌ పరంగా చూస్తే మాత్రం ఈ సంఖ్య 141 నుంచి 138కి తగ్గింది.

ఈ జాబితాలోని టాప్‌ 25 మంది లక్ష్మీపుత్రుల ఉమ్మడి సంపద దేశ జీడీపీలో 10 శాతానికి సమానంగా ఉంది. 953 మంది వాటా 27 శాతంగా ఉంది.గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో జాబితాలోని వారందరీ ఉమ్మడి సంపద 2 శాతం మేర పెరిగింది. సగటు సంపద మాత్రం 11 శాతం తగ్గింది.

344 మంది వ్యక్తులు లేదా జాబితాలోని వారిలో మూడోవంతుకన్నా ఎక్కువ మంది సంపద తగ్గింది. దీంతో మరో 112 మంది రూ.1,000 కోట్ల సంపదను చేరుకోలేకపోయారు. ఐదేళ్లకాలంలో భారత్‌ జీడీపీని 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లకాలంలో దేశంలోని సంపన్నుల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని హురన్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ, చీఫ్‌ రీసెర్చర్‌ అనాస్‌ రహమాన్‌ తెలిపారు. సంపన్న పారిశ్రామికవేత్తల్లో 246 మంది ముంబైలోని ఉంటున్నారు. న్యూఢిల్లీలో 175 మంది, బెంగళూరులో 77 మంది ఉన్నారు.

82 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వీరిలో 76 శాతం మంది స్వయంగా సంపన్నులుగా ఎదిగారు. వీరిలో 31 మంది అమెరికాలో ఉన్నారు. మిగతా వారు యూఏఈ, యూకేలో ఉన్నారు.

25 ఏళ్ల వయసున్న ఓయో రూమ్స్‌ వ్యవస్థాపక సీఈఓ రితేష్‌ అగర్వాల్‌ సంపన్నుల జాబితాలో అత్యంత యువ సంపన్నుడిగా నిలిచారు. ఈయన సంపద రూ.7,500 కోట్లు. 40 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారిలో మీడియా డాట్‌ నెట్‌కు చెందిన దివ్యాంక్‌ తురకియా అత్యంత సంపన్నుడిగా ఉన్నారు.

జాబితాలో 152 మంది మహిళలు ఉండగా.. వీరి సగటు వయసు 56 ఏళ్లుగా ఉంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ రోషణి నాడార్‌ (19వ స్థానం.. 37 ఏళ్లు) అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈమె సంపద రూ.36,800 కోట్లుగా ఉంది. ఆమె తర్వాత గోద్రేజ్ గ్రూప్ స్మితా వీ క్రుష్ణ ఉన్నారు. స్వయంశక్తితో ఎదిగిన మహిళల్లో అత్యంత శ్రీమంతురాలిగా బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ తన స్థానాన్ని నిలుపుకున్నారు.

జాబితాలోని వారందరి సగటు సంపద రూ.5,300 కోట్లు ఉండగా.. సగటు వయసు 60గా ఉంది. కర్కాటకం, కన్య, మేషం, సింహం, వృశ్చిక రాశుల వారే సంపన్నుల జాబితాలో అధిక శాతం మంది ఉన్నారు.

ఇక సంపన్నుల విషయంలో భాగ్యనగరానికి నాలుగో స్థానం లభించింది. హైదరాబాద్ నగరానికి చెందిన 63 మంది పారిశ్రామికవేత్తలకు ఈ జాబితాలో చోటు దక్కింది. 2018తో పోలిస్తే 17 మంది పెరిగారు. తెలంగాణలో 68 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది ఈ జాబితాలో స్థానం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సంపన్న కుటుంబంగా గల్లా రామచంద్ర నాయుడు ఫ్యామిలీ నిలిచింది.

తొలి 100 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో పార్మా అధినేత పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల ఆస్తులతో 51వ ర్యాంకు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత పీ పిచ్చిరెడ్డి రూ.13,400 కోట్లతో 57వ ర్యాంకు, మేఘా ఇంజినీరింగ్ కే చెందిన పీవీ క్రుష్ణారెడ్డి రూ.12,900 కోట్లతో 63వ ర్యాంక్, దివీస్ ల్యాబోరేటరీస్ సంస్థకు చెందిన దివి సత్చంద్ర కిరణ్ రూ.10,200 కోట్లతో 83వ ర్యాంక్, దివీస్ ల్యాబోరేటరీస్ కు చెందిన నీలిమా మోటపర్తి రూ.9,800 కోట్లతో 89వ ర్యాంకు పొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios