Asianet News TeluguAsianet News Telugu

బలవంతపు టేకోవర్ వ్యూ: ఎల్ & టి.. మైండ్‌‘ట్రీ’ గేమ్‌!!

భారత ఐటీ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నది. బలవంతంగా గుప్పిట్లోకి తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైండ్ ట్రీ సంస్థను చేజిక్కించుకునేందుకు ఎల్ అండ్ ట్రీ ప్రయత్నాలు సాగిస్తున్నది. 

L&T makes Rs 5,030 cr offer to buy 31% stake in Mindtree
Author
New Delhi, First Published Mar 19, 2019, 10:49 AM IST

భారత ఐటీ రంగంలోనే తొలి బలవంతపు టేకోవర్‌కు రంగం సిద్ధమైంది. ప్రమోటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. మౌలిక రంగ దిగ్గజంగా పేరొందిన ఎల్ అండ్ టీ అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫోకామ్.. మైండ్ ట్రీ అనే ఐటీ కంపెనీలో మెజారిటీ వాటా స్వాధీనానికి కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్లే సోమవారం రాత్రి పావులు కదిపింది. 

66% వాటా కోసం రూ.10,800 కోట్ల ఆఫర్
మైండ్ ట్రీలో 66 శాతం వరకు వాటా కొనుగోలు చేసేందుకు రూ.10,800 కోట్లను ఆఫర్‌ చేసింది. అంతకుముందు కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ నుంచి 20.32% వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.

అప్పుడే బహిరంగ మార్కెట్‌ నుంచి మరో 15 శాతాన్ని సొంతం చేసుకోవడానికి బ్రోకర్ల ద్వారా ఆర్డర్లు పెట్టింది. ప్రతిపాదిత కొనుగోలు 2019-20 తొలి త్రైమాసికంలో పూర్తవుతుందని సమాచారం. 

మైండ్ ట్రీ, ఎల్ అండ్ ట్రీ మధ్య కొత్త మలుపులు
దీంతో ఇటు మైండ్ ట్రీ వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ప్రయత్నిస్తున్నారు. టేకోవర్‌ చేసేందుకు అటు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

కాఫీ డే ‘సిద్ధార్థ’ వాటా కొనుగోలు తర్వాత ఓపెన్ ఆఫర్‌పై ఇలా
మెజారిటీ వాటాదారు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ వాటాలను కొనుగోలు తర్వాత  మైండ్ ట్రీ సంస్థకు ఓపెన్‌ ఆఫర్‌ కూడా ప్రకటిస్తున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకూ తెలిపింది. టేకోవర్‌ తర్వాత కూడా మైండ్‌ట్రీ లిస్టెడ్‌ కంపెనీగానే కొనసాగుతుందని ఎల్‌అండ్‌టీ సీఈవో ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. 

సంస్థ నియంత్రణ కాపాడుకునేందుకు మైండ్ ట్రీ వ్యవస్థాపకులు
కంపెనీ తమ చేతుల నుంచి చేజారిపోకుండా కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సుబ్రతో బాగ్చీ.. ఈ నెల 17న ఒడిశా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధిపతి పదవికి రాజీనామా చేశారు. తదుపరి మైండ్ ట్రీ మనుగడ కాపాడుకునే వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. 

ఇలా ‘ఎల్ అండ్ టీ’పై సుబ్రతో బాగ్చీ ట్వీట్స్
‘మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్‌ చేసే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, కంపెనీని కాపాడుకునేందుకు వెళ్లక తప్పడం లేదు. చెట్టును (ట్రీ) నరికేసి ఆ స్థానంలో షాపింగ్‌ మాల్‌ కట్టేందుకు బుల్‌డోజర్లు, రంపాలతో వచ్చిన వాళ్ల నుంచి కంపెనీని కాపాడుకోవాల్సి ఉంది’ అంటూ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘మైండ్‌ ట్రీ అనేది కొనుగోలు చేయడానికి లేదా అమ్మే ఆస్తి కాదు. అది ఒక జాతీయ సంపద. విశిష్ఠ సంప్రదాయం కలిగి ఉంది. కార్పొరేట్‌ పాలనలో ప్రామాణికంగా మారింద’ని చెప్పుకొచ్చారు.

సిద్ధార్థ నుంచి రూ.3,269 కోట్లకు వాటా కొనుగోలు
ఒకవేళ మైండ్‌ట్రీని గానీ ఎల్‌అండ్‌టీ చేజిక్కించుకోగలితే దేశీ ఐటీ రంగంలో ఇది తొలి హోస్టైల్‌ టేకోవర్‌ కానుంది.  మైండ్‌ ట్రీలో పెద్ద వాటాదారు సిద్ధార్థ నుంచి వాటాల కొనుగోలు కోసం ఎల్‌అండ్‌టీ షేర్ ఒక్కింటికి రూ. 980 చొప్పున దాదాపు రూ. 3,269 కోట్లు వెచ్చిస్తోంది.

ఓపెన్‌ మార్కెట్‌ నుంచి ఇంకో 15 శాతం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 2,434 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు, షేర్ ఒక్కింటికి రూ. 980 చొప్పున రేటుతో మరో 31 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందుకోసం దాదాపు రూ. 5,027 కోట్లు వెచ్చించాల్సి రానుంది.

మూడంచెల్లో ఎల్ అండ్ టీకి 66.3% వాటాలు
మొత్తం మీద మూడంచెల ఈ డీల్‌తో మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 66.3% దాకా వాటాలు లభించే అవకాశం ఉంది. ఇందుకోసం మొత్తం రూ. 10,730 కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌కు యాక్సిస్‌ క్యాపిటల్, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా సంస్థలు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. టేకోవర్‌ యత్నాలను ఎదుర్కొనేందుకు మైండ్ ట్రీవ్యవస్థాపకులు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

సిద్ధార్థ వాటాల బైబ్యాక్ పై ఇతర మైండ్ ట్రీ వ్యవస్థాపకుల ఫోకస్
సిద్ధార్థ నుంచి వాటాలను బైబ్యాక్‌ చేయడంపైనా ఇతర మైండ్ ట్రీ వ్యవస్థాపకులు దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా కేకేఆర్, బేరింగ్‌ ఏషియా, క్రిస్‌క్యాపిటల్‌ తదితర ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇవేమీ ముందుకు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు మూడు ప్రధాన కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

నియంత్రణ వదులుకునేందుకు మైండ్ ట్రీ మేనేజ్మెంట్ నో
మైండ్ ట్రీ కంపెనీ యాజమాన్య అధికారాన్ని ఎక్కువగా వదులుకునేందుకు వ్యవస్థాపకులు సిద్ధంగా లేకపోవడం, ఎల్‌అండ్‌టీ ఇచ్చే ఆఫర్‌కి దీటుగా చాలా మటుకు ఇన్వెస్టర్లు నిధులు వెచ్చించే అవకాశాలు లేకపోవడం, ఎల్‌ & టీతో పోరాటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం ఇందుకు కారణాలని తెలుస్తోంది.  

ఇలా మైండ్ ట్రీ స్థాపన
1999లో సుబ్రతో బాగ్చీ, అశోక్‌ సూతా, నమకల్‌ పార్థసారథి, కృష్ణకుమార్‌ నటరాజన్, స్కాట్‌ స్టేపుల్స్‌ తదితరులు 10 మంది కలిసి మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. 2000లో వీజీ సిద్ధార్థ నుంచి తొలి విడత కొంత మేర పెట్టుబడులు సమీకరించారు. 2008లో మైండ్‌ట్రీ కన్సల్టింగ్‌ పేరు మైండ్‌ట్రీగా మారింది. 

అశోక్ సూత వాటాల కొనుగోలుతో సిద్ధార్థ ఇలా కీలకం
2011లో వ్యవస్థాపక చైర్మన్‌ అశోక్‌ సూతా రాజీనామా చేసినప్పుడు ఆయన వాటాలను కూడా కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌గా మారారు. 2018లో మైండ్‌ట్రీ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న సిద్ధార్థ.. తన వాటాలను విక్రయానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌తో సిద్ధార్థ చర్చలు కూడా జరిపారు.

ఇలా ఎల్ అండ్ టీ ప్రయత్నాలు
అదే సమయంలో ఐటీ కార్యకలాపాల విభాగం (ఎల్‌అండ్‌టీ  ఇన్ఫోటెక్‌ –ఎల్‌టీఐ) కూడా ఉన్న ఎల్‌అండ్‌టీ అప్పుడే ఇతర సంస్థల కొనుగోలు ప్రయత్నాల్లో ఉండటంతో.. దీనిపైనా దృష్టి సారించింది. మిగతా వ్యవస్థాపకులను కూడా ఒప్పించగలిగితే.. మరింత అధిక రేటు ఇస్తామంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎఎం నాయక్‌ ఆఫర్‌ ఇవ్వడంతో.. సిద్ధార్థ ఆ ప్రయత్నాలూ చేశారు. 

ఎల్ అండ్ టీ ప్రపోజల్ కు మైండ్ ట్రీ నో
కానీ, మైండ్ ట్రీ వ్యవస్థాపకులు ఇందుకు ఇష్టపడటం లేదు. రెండు సంస్థల నిర్వహణ తీరు, పని సంస్కృతిలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం.

ఇదే సాకుతో సంస్థాగత ఇన్వెస్టర్లు, క్లయింట్లు,  ఉద్యోగులు ఈ డీల్‌పై విముఖంగా ఉన్నారంటూ ఇటీవలే ఎల్‌అండ్‌టీ బోర్డుకు కూడా వారు లేఖ రాసినట్లు సమాచారం.  సోమవారం మైండ్‌ట్రీ షేరు బీఎస్‌ఈలో 1.74 శాతం పెరిగి రూ. 962.50 వద్ద ముగిసింది.

మైండ్ ట్రీ ప్లస్ పాయింట్స్ ఇవీ
దాదాపు ఒక బిలియన్‌ డాలర్ల ఆదాయం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. క్లౌడ్, బిగ్‌ డేటా వంటి కొంగొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలు మైండ్‌ట్రీకి ప్లస్‌ పాయింట్లు కాగా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) దీనిపై ఆసక్తి కనబరుస్తోంది. ఎల్‌టీఐ నికర విలువ దాదాపు రూ. 4,387 కోట్లు.

మైండ్ ట్రీ పరిస్థితి ఇది
2018 డిసెంబర్‌ నెలాఖరు నాటికి సంస్థ దగ్గర సుమారు రూ. 2,032 కోట్ల మేర నగదు, లిక్విడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. మైండ్‌ట్రీలో 51 శాతం వాటాలు దక్కించుకున్న పక్షంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఎల్‌టీఐకి అదనంగా మైండ్‌ట్రీ నుంచి రూ. 460 కోట్ల దాకా లాభాలు దఖలుపడతాయి. రెండూ కలిశాయంటే.. ఆదాయాలు 1.7 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయని అంచనా. 

దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఆరో స్థానం
మైండ్ ట్రీ సంస్థను ఎల్ అండ్ టీ టేకోవర్ చేస్తే దేశీయ ఐటీలో ఆరు పెద్ద సంస్థ ఏర్పాటైనట్లవుతుంది. రెండింటికీ అమెరికా, యూరప్‌లే ప్రధాన మార్కెట్లు. టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్‌ విభాగాల్లో మైండ్‌ట్రీ పటిష్టంగా ఉండటం.. ఎల్‌టీఐకి లాభించనుంది.

మైండ్‌ట్రీ మొత్తం వ్యాపారంలో డిజిటల్‌ వాటా 49.5 శాతం కాగా ఎల్‌టీఐకి 37 శాతమే ఉంది. అంతేకాక ఉద్యోగిపై సగటు ఆదాయాన్ని చూస్తే ఎల్‌టీఐ కన్నా మైండ్‌ట్రీదే పైచేయిగా ఉంది. మైండ్‌ట్రీకి ప్రస్తుతం 19,908 మంది ఉద్యోగులు, 340 మంది క్లయింట్లు ఉన్నారు. 

ఇప్పటికే ఎల్ అండ్ టీకి రెండు ఐటీ సంస్థలు
ఎల్‌ అండ్‌ టీకి ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ పేరిట రెండు ఐటీ కంపెనీలున్నా.. మైండ్‌ ట్రీని కూడా జత చేసుకుని క్లయింట్ల పరిధిని, ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది.

ఎల్‌ అండ్‌ టీ గతంలోనూ కొన్ని పెద్ద కంపెనీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. ఎంఫసిస్‌(2013), హెక్సావేర్‌(2012), ఈఎక్స్‌ఎల్‌ సర్వీసెస్‌(2011) వంటివాటిపై అప్పట్లో కన్నేసిందన్న వార్తలు వచ్చాయి. కానీ అవేవీ జరగలేదు. 

మైండ్ ట్రీ వ్యాపార పురోగతికి నో డోకా
మైండ్‌ ట్రీ 2018-19లో ఇప్పటిదాకా పొందిన కాంట్రాక్టుల విలువ 16.8% మేర పెరిగిందంటే.. ఆ సంస్థ వ్యాపార వృద్ధికి ఢోకా లేదని అర్థమవుతూనే ఉంది. 2018-2020లో 15.6 శాతం మేర డాలర్ల ఆదాయం పెరుగుతుందన్న ఆదాయాలూ ఉన్నాయి. ఇవన్నీ చూసే ఎల్‌ అండ్‌ టీ ఈ కంపెనీపై కన్నేసిందని అనుకోవాలి.

మైండ్ ట్రీ ప్రమోటర్ల వాటా 13 శాతం
ప్రస్తుతం మైండ్‌ట్రీ ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమైన బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, సీఈవో రోస్టో రవనన్‌ తదితరులకు 13 శాతం వాటాలు ఉన్నాయి. నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రావణన్‌కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి.

కాఫీ డే, సిద్దార్థ వాటాల విక్రయం.. కాఫీ డేపైనే సిద్దార్థ ఫోకస్
‘కాఫీ డే ట్రేడింగ్‌, వి.జి. సిద్ధార్థ, ఇతరులు కలిసి మైండ్‌ ట్రీలు తమకున్న మొత్తం వాటాను రూ.3,269 కోట్లకు విక్రయిస్తున్న’ట్లు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.

ఈ నిధుల ద్వారా కాఫీ డే గ్రూప్‌ తన రుణాలను తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ వ్యాపార పునర్నిర్మాణం వల్ల మా పోర్ట్‌ఫోలియోను తగ్గించుకుని.. మా కాఫీ వ్యాపారంపై ఎక్కువ సమయం కేటాయించడానికి సమయం చిక్కుతుందని సిద్ధార్థ పేర్కొన్నారు.    

ఎస్ఎం క్రుష్ణ అల్లుడే వీజీ సిద్దార్థ
భారత విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి ఎస్‌.ఎమ్‌. కృష్ణ అల్లుడే ఈ సిద్ధార్థ. కాఫీ డేను వ్యవస్థాపించడం  ద్వారా ఈయన పేరు సంపాదించుకున్నారు. అతిపెద్ద కాఫీ ఎగుమతిదారు కూడా ఆయనే కావడం గమనార్హం.

1999లో తొలుత మైండ్‌ ట్రీలో 6.6 శాతం వాటాను కొనుగోలు చేసిన సిద్ధార్థ జూన్‌ 2011 నుంచి ఆ వాటాను పెంచుకుంటూ పోయారు. అయితే 10 నెలల కిందటి నుంచి కంపెనీ నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే బోర్డు నుంచీ వైదొలగారు. ఇపుడు మైండ్‌ ట్రీ కొనుగోలులో ఎల్‌ అండ్‌ టీకి చుక్కానిలా మారారు.

Follow Us:
Download App:
  • android
  • ios