Asianet News TeluguAsianet News Telugu

గల్ఫ్‌కు జెట్ ఎయిర్‌వేస్‌ సేవలు బంద్!

ఒకప్పుడు వెలుగు వెలిగిన జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు మనుగడే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. నిధుల కొరతతో సతమతం అవుతూ చివరకు సిబ్బంది వేతనాలే చెల్లించలేని దుర్భర స్థితిలో ఉన్న జెట్ ఎయిర్వేస్.. గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేయనున్నది.

Jet Airways to opt out of seven gulf routes, will cancel 40 flights a week
Author
Delhi, First Published Dec 3, 2018, 8:35 AM IST

విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన జెట్ ఎయిర్‌వేస్ ఇక కనుమరుగు కాబోతున్నాదా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తున్నది. ఇప్పటికే పైలట్లకు, సిబ్బందికి సరైన సమయంలో జీతాలు చెల్లించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ..

తాజాగా అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల నుంచి ఏడు గల్ఫ్ దేశాలకు తన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అభిజ్ఞవర్గాలు వెల్లడించాయి. 

నరేశ్ గోయల్ సారథ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం దోహా, మస్కట్, అబుదాబి, దుబాయిలకు దేశీయంగా పలు నగరాల నుంచి వారానికి 39 చొప్పున సర్వీసులను నడుపుతున్నది.

జెట్ ఎయిర్‌వేస్‌కు కీలక మార్కెటైన గల్ఫ్ దేశాల్లో డిమాండ్ పడిపోతుండటం, సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడికి నడిపే సర్వీసులతో ఎటువంటి లాభం వచ్చే అవకాశాలు లేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారి ఒకరు తెలిపారు. అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా ఉన్నప్పటికీ అదే రూట్లలో విమానాలను నిలిపివేయనుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.

వీటిలో కొచి, కోజికూడ్, తిరువనంతపురంల నుంచి దోహాలకు, లక్నో, మంగళూరు నుంచి అబుదాబి రూట్లకు నడుపనున్న విమాన సర్వీసులను నిలిపివేయనున్న సంస్థ..మంగళూరు-దుబాయిల మధ్య నూతన సర్వీసును ప్రారంభించే అవకాశాలు లేవని ఆ వర్గాల కథనం. ఈ నెల 5 నుంచి ఈ సర్వీసులన్ని నిలిచిపోనున్నాయి. 

వీటితోపాటు ఢిల్లీ-మస్కట్‌ల మధ్య నడిచే విమాన సర్వీసును కూడా ఈ నెల నుంచి జెట్ ఎయిర్ వేస్విరమించుకోనున్నది. ప్రస్తుతం కొచి-దోహా, మంగళూరు-అబుదాబి, మంగళూరు-దుబాయి, లక్నో-అబుదాబిల మధ్య రోజుకు విమాన సర్వీసులను నడుపుతున్న సంస్థ..

కోజికూడ్-దోహా, ఢిల్లీ-మస్కట్‌ల మధ్య వారానికి నాలుగు రోజులపాటు, తిరువనంతపురం-దోహాల మధ్య వారానికి మూడుసార్ల చొప్పున సర్వీసులను అందిస్తున్నది. అయినా గల్ఫ్ కార్యకలాపాలపై జెట్ ఎయిర్‌వేస్ గట్టి నమ్మకంతో ఉన్నది.

ఈ ఏడు రూట్ల విమాన సర్వీసులకు స్వస్తి పలుకనున్న సంస్థ..ముంబై-దోహా, ఢిల్లీ-దోహా, ముంబై-దుబాయి రూట్లలో మరిన్ని నూతన సర్వీసులు అందించే అవకాశం ఉన్నదని తెలిపింది. నష్టాల్లో నడుస్తున్న రూట్లకు స్వస్తి పలికి లాభాల్లో నడుస్తున్న రూట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.1,261 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios