‘గూగుల్ పే’ అధికారికమేనా?: ఆర్బీఐ, జీపేకు కోర్టు నోటీసులు
‘గూగుల్ పే’ అధికారికతపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. ఈ యాప్ను రిజర్వ్ బ్యాంక్ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నవారిలో దాదాపు ప్రతి ఒక్కరికీ ‘గూగుల్ పే’ గురించి తెలిసే ఉంటుంది. డబ్బులు చెల్లింపులు, స్వీకరించడం కోసం ఈ యాప్ను విస్తృతంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ‘గూగుల్ పే’ అధికారికతపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. ఈ యాప్ను రిజర్వ్ బ్యాంక్ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
గూగుల్ పే(జీ-పే) యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేగాక, ఈ ఏడాది మార్చి 20న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలో ‘గూగుల్ పే’ పేరు లేదని తెలిపారు. మిశ్రా పిటిషన్పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం.. అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్ పే యాప్ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్బీఐని ప్రశ్నించింది.
ఈ పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలని ఆర్బీఐ, గూగుల్ ఇండియాలకు జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ఏజే భంభానీలతోకూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.