‘ఈ-కామర్స్’ డేటా లోకలైజేషన్..నో ట్రాన్స్ఫర్: టర్మ్స్ & కండీషన్స్ మస్ట్
దేశీయంగా మన వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు తరలించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం 'ఈ-కామర్స్'లో మనం పొందుపర్చిన సమాచారం పదిలంగా ఉండాల్సిందే. సదరు సంస్థలు ఎటువంటి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీకి, విదేశాలకు ఇచ్చేందుకు వీల్లేదు.
దేశీయ ఈ-కామర్స్ రంగంలో జరుగుతోన్న అవకతవకల కట్టడికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. కేంద్రం శనివారం విడుదల చేసిన 'ఈ-కామర్స్ పాలసీ' ముసాయిదాలో దేశాల మధ్య డేటా బదిలీ, సునిశిత డేటాను స్థానికంగా, విదేశాల్లో నిల్వ చేసే అంశంపై షరతులు, నిబంధనలను విధించింది.
‘డేటా అనేది ఇంధనం లాంటిది. అయితే అది దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. డేటా వల్ల కలిగి ఆర్థిక ప్రయోజనాలన్నీ దేశాభివృద్ధికి, భారత పౌరులకు, అర్హత కంపెనీలకు మాత్రమే ఉపయోగపడాలి’ అని ఆ ముసాయిదా పేర్కొంది.
ఏదైనా కంపెనీ భారత్లోని సునిశిత సమాచారాన్ని సేకరించి, విదేశాల్లో నిల్వ చేయాలని భావిస్తే.. అందుకు కొన్ని షరతులను పాటించాల్సి ఈ- కామర్స్ ముసాయిదా పేర్కొంది. ఈ-కామర్స్లో చట్టపరమైన, సాంకేతిక పరమైన అంశాలలో కొన్ని స్పష్టమైన నిబంధనలతో ప్రభుత్వం దీనిని రూపొందించింది.
ముఖ్యంగా ఈ-కామర్స్లో భాగంగా సేకరించిన డేటాను దేశం దాటించకుండా ఈ పాలసీలో స్పష్టమైన విధానాలను ప్రకటించింది. భారత్ సున్నితమైన సమాచారాన్ని సేకరించడం, దానిని దేశీయంగానే విశ్లేషించడం, విదేశాల్లో సమాచారాన్ని నిలువ చేసే విషయమై కొత్త పాలసీల్లో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు.
మొత్తం 42 పేజీల్లో రూపొందించిన ఈ-కామర్స్ ముసాయిదా పత్రాన్ని 'డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (డీపీఐఐటీ) వెల్లడించింది.
ఇందులో ఈ-కామర్స్ ఎకోసిస్టమ్ సమాచారం, మౌలిక వసతుల అభివృద్ధి, ఈ-కామర్స్ మార్కెట్ స్థలాలు, నియంత్రణ అంశాలు, దేశీయ డిజిటల్ ఎకానమీకి ఉద్ధీపన, ఈ-కామర్స్ ద్వారా ఎగుమతుల అభివృద్ధి తదితర అంశాలను కేంద్రంగా చేసుకొని కొత్త పాలసీని రూపొందించారు.
ఈ-కామర్స్ రంగంపై కేంద్రం ముసాయిదా వెల్లడించడం ఇది రెండోసారి. గతంలో ప్రభుత్వం వెల్లడించిన ఈ-కామర్స్ రంగం పాలసీ ముసాయిదాపై సర్వత్రా విమర్శలు వెలువడ్డాయి. నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని కొత్త నిబంధనలతో ఈ-కామర్స్ పాలసీని ప్రకటించింది.
వివిధ ఐవోటీ ఉపకరణాలతో సమీకరించిన సమాచారాన్ని భారత అభవృద్దికే వినియోగించాలన్న నినాదంలో కొత్త పాలసీలో విధానాలను రూపొందించారు. భారత సమాచారంతో ఇక్కడి కంపెనీలు, ప్రజలే లబ్ధిపొందాలనే ధ్యేయంతో దీనిలో విధానాలను తీర్చిదిద్ధినట్లు 'నేషనల్ ఈ-కామర్స్ పాలసీ-ఇండియాస్ డేటా ఫర్ ఇండియా డెవలప్మెంట్' పాలసీ పేర్కొంది.
కొత్త ముసాయిదా ప్రకారం ఈ-కామర్స్ కంపెనీలు భారత్ నుంచి సమీకరించిన డేటాను ఇతర థర్డ్పార్టీ వారికి గానీ.. విదేశీ ప్రభుత్వాలకు గానీ వెల్లడించేందుకు అనుమతిలేదు. తప్పనిసరి పరిస్థితిలో సమాచారం పంచుకోవాల్సి వస్తే భారత ప్రభుత్వ వర్గాల అనుమతి తీసుకొని ముందుకు సాగాలి.
ప్రభుత్వ అందుబాటులోకి తెచ్చిన ఈ-కామర్స్ ముసాయిదా పత్రంలో కొత్త మార్కెట్ప్లేస్ మోడల్ను (భాగస్వామ్యం లేకుండా ఒంటరిగానే) అభివృద్ధి చేసేందుకు సర్కారు పెద్దపీట వేసింది. ఈ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించేందుకు, ప్రోత్సహించేందుకు పలు చర్యలు ప్రకటించింది.
ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్కు ఉపయోగపడే వివిధ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని విధించకూడదని నిర్ణయించారు. ఈ-కామర్స్ రంగంలో షిప్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకు మరిన్న ప్రోత్సాహకాలను కల్పించడంతో పాటు పరిపాలనపరంగా అనుమతులను తగ్గించాలని ముసాయిదా తెలిపింది.