Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్‌వార్‌కు తాత్కాలిక బ్రేక్: జీ-20 వేదికగా చైనా- అమెరికా మధ్య సంధి!!

ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత అగ్రదేశాలు అమెరికా, చైనాల మధ్య 90 రోజుల పాటు తాత్కాలిక సంధి కుదిరింది. విదేశీ ఉత్పత్తులతో ఏర్పడే వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా వస్తువుల దిగుమతిపై 10 శాతం సుంకాలు.. దానికి ప్రతిగా చైనా సుంకాలు విధించడంతో యావత్ ప్రపంచం తల్లడిల్లింది. వర్ధమాన దేశాల కరెన్సీ తీవ్రంగా నష్టపోయింది. ఎట్టకేలకు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన జీ-20 సదస్సు వేదికగా ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల్లో వివాదాల పరిష్కారానికి నిర్ణయం జరిగింది. ప్రస్తుతానికి కొత్త టారిఫ్‌లు విధించబోమని ట్రంప్‌ హామీ ఇవ్వగా, అమెరికా ఎదుర్కొనే వాణిజ్య లోటు భర్తీ చేయడానికి జిన్‌పింగ్‌ భరోసా కల్పించారు.

China and US declare 90-day halt to new trade tariffs
Author
Buenos Aires, First Published Dec 3, 2018, 10:28 AM IST

బ్యూనస్‌ ఎయిర్స్‌: దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేసిన అమెరికా- చైనా మధ్య  ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీనిలో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇవ్వగా ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీకి చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ భరోసానిచ్చారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జీ–20 సదస్సు వద్ద దాదాపు 2.30 గంటల పాటు జరిగిన విందు భేటీలో వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. అయితే వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ ప్రకటన ప్రకారం ఈ తాత్కాలిక విరామం 90 రోజులు మాత్రమే.

2019 జనవరి 1 నుంచి 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచకుండా ప్రస్తుతం 10 శాతానికే పరిమితం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అంగీకరించారు. దానికి ప్రతిగా 375 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికా ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేయడానికి జి జిన్‌పింగ్‌ అంగీకారం తెలిపారు. ’అమెరికా, చైనాలకు అపరిమిత ప్రయోజనాలు చేకూర్చేలా  ఫలవంతమైన చర్చలు జరిగాయి’ అని ట్రంప్‌ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్‌ పేర్కొన్నది. ట్రేడ్‌వార్‌కు తాత్కాలికంగా బ్రేకులు వేసే దిశగా ట్రంప్, జిన్‌పింగ్‌ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ చైనా మీడియా కథనాలు ప్రచురించింది.  

ముందుగా ప్రతిపాదించినట్లు జనవరి ఒకటో తేదీ నుంచి టారిఫ్‌లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఈ అంశంపై మరిన్ని చర్చలకు ఆస్కారం లభించిందన్నారు. వాణిజ్య లోటు భర్తీ క్రమంలో అమెరికా నుంచి వ్యవసాయ, ఇంధన, పారిశ్రామిక రంగం తదితర ఉత్పత్తులను గణనీయంగా కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ఆమె పేర్కొన్నారు. 

టెక్నాలజీ బదలాయింపు, మేథోహక్కుల పరిరక్షణ తదితర అంశాలపై తక్షణం చర్చించేందుకు ట్రంప్, జిన్‌పింగ్‌ నిర్ణయించినట్లు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ వివరించారు. ఇరు పక్షంలో 90 రోజుల్లోగా ఒక అంగీకారానికి రాలేకపోయిన పక్షంలో 10 శాతం సుంకాలను 25 శాతానికి అమెరికా పెంచుతుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ పేర్కొన్నారు. గతంలో తిరస్కరించిన క్వాల్‌కామ్‌–ఎన్‌ఎక్స్‌పీ డీల్‌ తన ముందుకొచ్చిన పక్షంలో ఈసారి ఆమోదముద్ర వేసేందుకు జిన్‌పింగ్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు శాండర్స్‌ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios