Asianet News TeluguAsianet News Telugu

ఉర్జిత్ భవితవ్యంపై ఉత్కంఠ: విభేదాల నేపథ్యంలో భేటీ

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని సవాల్ చేసే రీతిలో కేంద్రం సెక్షన్ 7 ప్రయోగిస్తామనడమే దీనికి నేపథ్యం. గురుమూర్తి వంటి ప్రభుత్వ నామినీలు కేంద్రాన్ని వెనుకేసుకు వస్తున్నారు.

Centre's Nominees On RBI Board To Push Harder At Monday Meet: Report
Author
Mumbai, First Published Nov 19, 2018, 7:48 AM IST

న్యూఢిల్లీ/ముంబై: కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనున్నది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్య పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నా.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యలు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎదురు దాడితో విభేదాలు బహిర్గతమైన నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారు? ఎలాంటి నిర్ణయాలు వెలువడనున్నాయోనని ఆర్థిక రంగ నిపుణులు, స్టాక్‌ మార్కెట్‌ వర్గాలతోపాటు సామాన్యులూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆర్బీఐ వద్దనున్న మిగులు నిధుల నిర్వహణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ద్రవ్య లభ్యత పెంచే చర్యలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇప్పటికే షెడ్యూలు చేసిన, సాదాసీదా సమావేశమని సర్కారు వర్గాలు చెబుతున్నా.. ఎజెండాలో లేని అంశాలను కూడా సభ్యులు లేవనెత్తనున్నారని తెలుస్తోంది. 

వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు తదితర వివాదాస్పద అంశాలపై ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ టీమ్‌పై ఆర్థిక శాఖ నామినీలు, కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు అస్త్రాలు సంధించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పటేల్‌ రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్‌ వస్తున్నా.. ఆ ఒత్తిళ్లకు ఆయన లొంగకపోవచ్చని వివరించాయి. తాము అమలు చేస్తున్న విధానాలను మరింత గట్టిగా సమర్థించుకునే ప్రయత్నమే చేయొచ్చని పేర్కొన్నాయి. సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) కఠిన నిబంధనలు, చిన్న తరహా సంస్థలకు రుణాల మంజూరీ నిబంధనల సడలింపు వంటి విషయాల్లో నెలకొన్న విభేదాలను తొలగించుకునేలా ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని రూపొందించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీసీఏకి సంబంధించి ఈ సమావేశంలో కాకున్నా మరికొన్ని వారాల్లో తగు పరిష్కారమార్గం కనుగొనే అవకాశం ఉన్నట్లు వివరించాయి.  

కొన్ని వివాదాస్పద అంశాలను సడలించిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పలు బ్యాంకులకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులకు 11 బ్యాంకులు ప్రస్తుతం పీసీఏ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. రిస్కులెక్కువగా ఉన్న అసెట్స్‌కి, మూలధనానికి మధ్య నిష్పత్తి తగ్గినా, నికర నిరర్ధక ఆస్తులు పెరిగినా, అసెట్స్‌పై రాబడులు భారీగా తగ్గినా పీసీఏ నిబంధనలు అమల్లోకి వస్తాయి.  పీసీఏని ప్రయోగించడానికి అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు క్యాపిటల్‌ అడెక్వసీ రేషియోని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇక చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాల మంజూరీలో కొంత సడలింపునివ్వడం, లిక్విడిటీ కొరతను ఎదుర్కొంటున్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ద్రవ్య లభ్యత మెరుగుపడేలా వ్యవస్థలో మరింత నిధులను అందుబాటులోకి తేవడం వంటివి ఆర్‌బీఐ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ రంగాల సంస్థలకు రిస్కులు ఎక్కువగా పొంచి ఉన్నాయనే భావనతో ఆర్బీఐ దీన్ని విభేదిస్తోంది. రెండు పక్షాలు దీనిపై బహిరంగంగానే తమ మధ్య విభేదాలను బయటపెట్టాయి.   

సెంట్రల్‌ బ్యాంక్‌ స్వయం ప్రతిపత్తిని గౌరవించకపోతే ఎకానమీకి పెను విపత్తు తప్పదంటూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోసింది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ను దారికి తెచ్చుకునేందుకు గతంలో ఎన్నడూ ప్రయోగించని ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7ని ప్రయోగించడంపై కేంద్ర ఆర్థిక సమాలోచనలు కూడా జరపడం మరింత వివాదాస్పదమైంది.  అటు ఆర్‌బీఐలో కేంద్రం నామినేట్‌ చేసిన ఎస్‌ గురుమూర్తి సైతం కేంద్ర ప్రభుత్వ వాదనలను వెనకేసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ కలిసి పనిచేయాలని లేదా రాజీనామా చేసి తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కో–కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ సభ్యులు ఆర్థిక స్థిరత్వం, పరపతి విధాన బదిలీ, విదేశీ మారక నిల్వల నిర్వహణ తదితర కార్యకలాపాలపై ప్రతిపాదనల చర్చకు లేవనెత్తనున్నారు. దీంతో బోర్డు సమావేశం వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల అమలుకు ఇప్పటికే సర్కార్‌ నామినేట్‌ చేసిన బోర్డు సభ్యులకు దిశా, నిర్దేశం చేసి ఉంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ సమావేశంలో ఆర్బీఐ యంత్రాంగం ప్రభుత్వ ప్రతిపాదనలకు ససేమిరా అంటే ఆర్థిక స్థిరత్వం, పరపతి విధాన బదిలీ, విదేశీ మారక నిల్వల నిర్వహణ తదితర కార్యకలాపాలను పర్యవేక్షించే ప్యానెళ్ల ఏర్పాటుకు వీలు కల్పించేలా ముసాయిదా నిబంధనలను రూపొందించాలని ఆర్బీఐ బోర్డుకు సర్కార్‌ పరోక్షంగా సంకేతాలు జారీ చేసినట్లు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వ నామినీలు కూడా ఉన్న ఈ బోర్డుకు పర్యవేక్షక బాధ్యతలు వచ్చి చేరనున్నాయి. దీంతో ప్రభుత్వం నామినేట్‌ చేసిన బోర్డులోని ప్రయివేటు, కార్పొరేట్‌ కంపెనీల సభ్యులకు కూడా పర్యవేక్షణ అధికారాలు రానున్నాయి. 'అథారిటీ ఆఫ్‌ ఆర్బీఐ' బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుతం ఆర్బీఐలో కమిటీ ఆఫ్‌ సెంట్రల్‌ బోర్డు పట్టు సడలిపోనుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న రూ. 9 లక్షల కోట్ల నిధులపై అజమాయిషీని దక్కించుకునేందుకు ఆర్‌బీఐని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఆర్‌బీఐ బోర్డు భేటీ ఘర్షణాత్మకంగానే ఉండవచ్చని ట్వీట్ చేశారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద రూ. 9.59 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. ద్రవ్య లోటు తదితర సమస్యల పరిష్కారం కోసం వీటిలో కనీసం మూడో వంతు నిధులైనా (సుమారు రూ. 3.6 లక్షల కోట్లు) తమకు ఇవ్వాలంటూ ఆర్‌బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ బోర్డు భేటీ, చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్బీఐ అధినాయకత్వం కూడా సమిష్టిగా సర్కార్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బోర్డు సమావేశంలో వివాదం మరింతగా ముదిరితే గవర్నర్‌ ఉర్జిత్‌, డిప్యూటీ విరాల్‌ ఆచార్య తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios