టాటా మోటార్స్ కు తగ్గిన నష్టాలు: లాభాల్లో జాగ్వార్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లకు తగ్గాయి. గతేడాది రెండో త్రైమాసికం నష్టాలు రూ.1009 కోట్లతో పోలిస్తే.. ఈ ఏడాది ఆర్థిక మందగమనం మధ్య సంస్థ నష్టాలు రూ.188 కోట్లకు పడిపోవడం ఆశాజనక వాతావరణమే. ఇక టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సేల్స్ పెరిగి, లాభాల బాటలో పయనిస్తోంది.
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ కంపెనీపై దేశీయ మార్కెట్లో నెలకొన్న మందగమనం బాగానే ప్రభావం చూపించినా, గత క్యూ2లో వచ్చిన రూ.1,009 కోట్ల నష్టంతో పోలిస్తే ఈ ఏడాది నష్టాలు బాగానే తగ్గాయి.
గతేడాది రెండో త్రైమాసికంలో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈసారి రూ.65,432 కోట్లకు తగ్గిందని టాటా మోటార్స్ తెలిపింది. అయితే స్డాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం రాగా ఈ క్యూ2లో మాత్రం రూ.1,282 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్ సీఈఓ గుంటర్ బశ్చెక్ చెప్పారు.
also read దంతేరాస్ స్పెషల్: ఒక్కరోజే 15 వేల కార్ల పంపిణీ
దేశీయంగా హోల్సేల్స్ వాహన విక్రయాలు 44 శాతం తగ్గి 1,06,349కు తగ్గాయని తెలిపారు. సుదీర్ఘ మందగమనం కారణంగా వాహన విక్రయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం, కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు, నిధుల కొరత, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వంటి పరిణామాలు ప్రభావం చూపుతున్నాయన్నారు.
లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) హోల్సేల్స్ అమ్మకాలు మూడు శాతం పెరిగి 1,34,489 కు పెరిగాయని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్మెత్ చెప్పారు. జాగ్వార్ లాండ్ రోవర్ ట్రీ టాక్స్ ఫ్రాఫిట్ 156 పౌండ్ల నుంచి 246 పౌండ్లకు పెరిగింది. జాగ్వార్ లాండ్ రోవర్ ఫ్రాఫిట్లు, రెవెన్యూ గ్రోత్ తో కోలుకున్నది. ఆపరేటింగ్ ఎఫిసియెన్సీతోపాటు నూతన టెక్నాలజీలు, అవార్డు విన్నింగ్ ప్రొడక్ట్స్తో ముందుకు సాగుతోంది.
also read బీఎస్-6....వల్లే ఆటో సేల్స్ డౌన్... కారణం ?
రూ.10,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని టాటా మోటార్స్ తెలిపింది. మాతృ కంపెనీ టాటా సన్స్కు ఒక్కో షేర్ను రూ.150 ధరకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లు, వారంట్ల జారీ ద్వారా రూ.6,494 కోట్లు సమీకరిస్తామని, అలాగే విదేశీ వాణిజ్య రుణాల ద్వారా రూ.3,024 కోట్లు చొప్పున ఈ నిధులను సమీకరిస్తామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 5 శాతం నష్టంతో రూ.127 వద్ద ముగిసింది.
చైనాలో విక్రయాలు ప్రారంభం కావడం కూడా తమ లాభాలు పుంజుకోవడానికి కారణమని జాగ్వార్ లాండ్ రోవర్ సీఈఓ రాల్ఫ్ స్మెత్ చెప్పారు. ఇక ముందు తమ సంస్థ బ్రాండ్ ను ముందుకు తీసుకెళ్లడంతోపాటు వాహనాలను విద్ధుద్ధీకరించడంపైనే కేంద్రీకరిస్తుందన్నారు.