దటీజ్ హ్యుందాయ్: కస్టమర్ల మనస్సు గెలుచుకుందిలా!!
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ తన కార్ల వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలు అందించడంలో మొదటి స్థానంలో ఉందని తాజా సర్వే ఒకటి నిర్ధారించింది.
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ తన కార్ల వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలు అందించడంలో మొదటి స్థానంలో ఉందని తాజా సర్వే ఒకటి నిర్ధారించింది. దేశీయ రెండో అతి పెద్ద కార్ల విక్రయ సంస్థగా హ్యుండాయ్ రికార్డు సాధించింది. అదే హ్యుండాయ్ తాజా సర్వేలో 912పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నట్లు జేడీ పవర్ 2018 కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ సర్వేలో వెల్లడైంది. భారతదేశంలో గతేడాది కూడా ఈ దక్షిణ కొరియా కార్ల సంస్థే అగ్ర స్థానంలో ఉండటం గమనార్హం.
ఆ తర్వాత 874 పాయింట్లతో టాటా మోటార్స్ రెండో స్థానంలో ఉండగా, మహీంద్రా అండ్ మహీంద్రా 865 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. ఇక ఫోర్డ్ (829), టయోటా (827) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్రయాణికుల వాహనాల తయారీ, విక్రయాల్లో ముందున్న మారుతి సుజుకి కస్టమర్ సాటిస్పాక్షన్లో 804 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
వరుసగా 22ఏళ్ల నుంచి ఈ సర్వే కొనసాగుతోంది. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన వినియోగదారుడికి నుంచి అతడి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సేవలు అందించడం ప్రధానం అని ఈ సర్వే రుజువు చేసింది. విక్రయం, సర్వీసు, డీలర్ స్పందించిన తీరు ఇలా పలు విషయాలపై వినియోగదారుడిని ప్రశ్నించి అతను అందించే సమాచారాన్ని క్రోడీకరించి జేడీ పవర్ పాయింట్లు ఇస్తుంది. ఈ సర్వే కోసం నాణ్యత, వాహన పికప్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ సౌకర్యం, సర్వీస్ను చేయడంలో చొరవ మొదలైన ఐదు విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 9,045 వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు.