ముగ్గురు లోక్సభాపక్షనేతలకు.. హ్యాండిచ్చిన బాబు, జగన్, కేసీఆర్
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటారు. దానిని రుజువు చేస్తూ గత ఎన్నికల్లో గెలిచి.. ఆయా పార్టీల్లో కీలకపాత్ర పోషించిన నేతలకు అనూహ్యంగా ఈసారి లోక్సభ ఎన్నికలకు టికెట్ దక్కలేదు.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటారు. దానిని రుజువు చేస్తూ గత ఎన్నికల్లో గెలిచి.. ఆయా పార్టీల్లో కీలకపాత్ర పోషించిన నేతలకు అనూహ్యంగా ఈసారి లోక్సభ ఎన్నికలకు టికెట్ దక్కలేదు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన లోక్సభాపక్షనేతలు కావడం గమనార్హం.
2014 లోక్సభాపక్షనేతలుగా వ్యవహరించిన తెలుగుదేశం నేత తోటనరసింహం, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈసారి టిక్కెట్లు దక్కలేదు.
వీరిలో తోట నరసింహం అనారోగ్య కారణాలతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని, తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరగా కొన్ని కారణాల వల్ల టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వలేనని తేల్చి చెప్పారు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అని అందరూ భావించారు. అయితే తెలుగుదేశం నుంచి వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి జగన్ సీటు కేటాయించారు.
ఇక టీఆర్ఎస్ నుంచి లోక్సభాపక్షనేతగా వ్యవహరిస్తున్న జితేందర్ రెడ్డి మహబూబ్నగర్ నుంచి మరోసారి పోటీ చేయాలని ఆశించారు.
అయితే పార్లమెంటరీ నియోజకవర్గంలోని పలువురు ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ కేటాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకంజ వేశారు. జితేందర్ రెడ్డి స్థానంలో పారిశ్రామిక వేత్త మన్నె శ్రీనివాస్రెడ్డిని టీఆర్ఎస్ ఎంపిక చేసింది.