అలవోకగా సీఎం అయ్యేవారు: చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అభ్యర్థులను కొందరిని మార్చి ఉంటే చంద్రబాబునాయుడు అలవోకగా సీఎం అయ్యేవారని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
అనంతపురం:టీడీపీ అభ్యర్థులను కొందరిని మార్చి ఉంటే చంద్రబాబునాయుడు అలవోకగా సీఎం అయ్యేవారని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 40 శాతం ఎమ్మెల్యేలను మార్చాలని తాను చంద్రబాబును కోరినట్టు చెప్పారు. ఈ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే చంద్రబాబునాయుడు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అభ్యర్థుల ఎంపికపై జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబునాయుడు తీవ్రంగానే కసరత్తు చేశాడు. పార్టీ నేతలతో పాటు పలు సర్వేలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేశాడు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యాన్ని కూడ పాటించేందుకు ప్రయత్నించారు.
ఎంత కష్టమైనా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలను మార్చాలని కూడ చంద్రబాబును గతంలో కూడ జేసీ దివాకర్ రెడ్డి కోరారు.