వైసీపీలోకి కొణతాల రామకృష్ణ?: రేపు జగన్తో భేటీ
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శుక్రవారం నాడు వైఎస్ జగన్ సమక్షంలో కొణతాల వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
విశాఖపట్టణం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. శుక్రవారం నాడు వైఎస్ జగన్ సమక్షంలో కొణతాల వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
కొణతాల రామకృష్ణ గురువారం నాడు విశాఖపట్టణంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ నెల 17వ తేదీన కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
ఇటీవల రెండు దఫాలు కొణతాల రామకృష్ణ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. కొణతాల రామకృష్ణకు కూడ టిక్కెట్టు కేటాయించేందుకు బాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం నాడు కొణతాల రామకృష్ణ గురువారం నాడు అనుచరులతో సమావేశమయ్యారు . వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈ సమావేశంలో ఆయన ప్రకటించినట్టుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కొణతాల రామకృష్ణ శుక్రవారం నాడు ఉదయం లోటస్పాండ్లో జగన్ను కలవనున్నారు.
2014 ఎన్నికల సమయంలో కూడ కొణతాల రామకృష్ణ వైసీపీలో ఉన్నారు. కొణతాల రామకృష్ణతో వైరం ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడ తన ఇద్దరు కొడుకులతో కలిసి ఇటీవలనే వైసీపీలో చేరారు. వీరిద్దరూ కూడ బద్ద శత్రువులు. గత ఎన్నికల సమయంలో వీరిద్దరూ కూడ వైసీపీలోనే ఉన్నారు.
ఎన్నికల తర్వాత వీరిద్దరూ కూడ వేర్వేరు కారణాలతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. దాడి వీరభద్రరావు తటస్థంగా ఉన్నారు. టీడీపీలో ఆయన చేరాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.పవన్ కళ్యాణ్ ఆహ్వానించినా దాడి చేరలేదు. చివరకు వైసీపీ గూటికే చేరారు. దాడి వీరభద్రరావు వైసీపీలో చేరిన కొన్ని రోజులకే కొణతాల కూడ మళ్లీ వైసీపీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.