చంద్రబాబు పిలిస్తే.. టీడీపీ తరపున ప్రచారం చేస్తా: వీహెచ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిస్తే.. ఆయన తరపున ప్రచారం చేస్తానన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిస్తే.. ఆయన తరపున ప్రచారం చేస్తానన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.
ఏపీలో ఎన్నికల పరిధిలో లేని నిఘా అధికారిని ఈసీ బదిలీ చేయడం అన్యాయమన్నారు. తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో వైఎస్ జగన్కు లబ్ధి కలిగించేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని వీహెచ్ ఆరోపించారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ రాష్టాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారన్నారు. తెలంగాణలో ఓట్ల గల్లంతు విషయంలో సీఈవోపై చర్యలు తీసుకోలేదని.. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ సినిమా విడుదలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు హనుమంతరావు తెలిపారు.