లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
జగన్ అమరావతిలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందన్న ఆమె చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొడితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. చీరలు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్న చంద్రబాబుని మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.
విశాఖపట్నం: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు అంటూ ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా చోడవరంలో వైసీపీ మహిళా గర్జనలో పాల్గొన్న ఆమె తండ్రి గుడిని మింగితే కొడుకు గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారంటూ ఆరోపించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం అయితే మహిళలకు రక్షణ, గౌరవం ఉంటాయని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని ఎద్దేవా చేశారు. వీధికో బార్, గ్రామల్లో విచ్చలవిడిగా వైన్ షాపులకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారన్నారు. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి చేసినా, మహిళలను కించపరిచినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.
టీడీపీ పాలనలో చంద్రబాబును అన్న అని కాకుండా సున్నా అని పిలవాలని రోజా సూచించారు. మహిళలకు మాంగల్యం దూరం చేసే మద్యం అమ్మకాలు నిలిపివేసే వైఎస్ జగన్ ని మాత్రమే అన్నా అని పిలవాలన్నారు. ప్రజాసంకల్పయాత్రలో మహిళల కష్టాలు తెలుసుకొన్న వైఎస్ జగన్ నవరత్నాలను రూపొందించారని తెలిపారు.
అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకాలం ఎన్టీఆర్ భవన్ కూడా అమరావతిలో ఏర్పాటు చేయని చంద్రబాబు ఎన్నికల తర్వాత ఏపీని వదిలి వెళ్లాల్సిందేనంటూ ధ్వజమెత్తారు.
జగన్ అమరావతిలో అడుగుపెట్టిన వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందన్న ఆమె చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొడితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. చీరలు ఇస్తే ఓటు వేస్తారనే భ్రమలో ఉన్న చంద్రబాబుని మహిళలు చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు.
మహిళలకు కుటీర పరిశ్రమలు ఇవ్వని చంద్రబాబు తన కోడలు బ్రహ్మణీకి మాత్రం హెరిటేజ్ కంపెనీ ఇచ్చారంటూ దుయ్యబుట్టారు. పోస్ట్ డేటెడ్ చెక్లు ఇవ్వాలన్న ఆలోచన అవుట్ డేటెడ్ చంద్రబాబుది అని, డ్వాక్రా మహిళలకు ఇచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు కూడా లేవా అని నిలదీశారు.
ఈ చెక్కులు ద్వారా మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ చెక్కులు చెల్లవని చంద్రబాబుకు కూడా తెలుసనని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.