చంద్రబాబుతో బిజేపీ నేత విష్ణుకుమార్ రాజు భేటీ..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భేటీ కానున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీజేపీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భేటీ కానున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ఆయన పార్టీ మారాలా వద్ద అనే విషయంపై డోలాయమానంలో ఉన్నారు.
ఏపీలో బీజేపీకి పెద్దగా మైలేజ్ లేకపోవడంతో అధికార పార్టీ టీడీపీలో చేరదామని భావించారు. అయితే ప్రధాని విశాఖ పర్యటన తరువాత తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి కొత్త రైల్వేజోన్ ప్రకటిస్తే...బీజేపీకి మైలేజీ వస్తుందని, అప్పుడు పార్టీ అభ్యర్థిగా మళ్లీ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాట చెప్పారు.
ఒకవేళ రైల్వేజోన్ ప్రకటించకపోతే ఏమిటనేది ఆలోచిస్తానని వివరించారు. ఆయన ఆశించినట్టుగానే ప్రధాని విశాఖ పర్యటనకు ముందే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించింది. అందులో వాల్తేరు డివిజన్ లేకపోయినప్పటికీ ‘జోన్ తెస్తామని మాట ఇచ్చాము...తెచ్చాము. హామీ నిలుపుకొన్నాము’ అంటూ సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలోనే కొనసాగుతారని అందరూ భావించారు.
అయితే.. ఈ విషయంలో విష్ణుకుమార్ రాజు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. రైల్వే జోన్ వచ్చినా కూడా బీజేపీకి ఓట్లు పడతాయనే నమ్మకం లేదని విష్ణుకుమార్ రాజు అనుకుంటున్నారట. అందుకే.. ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే త్వరలో చంద్రబాబుతో భేటీ కానున్నట్లు ప్రచారం ఊపందుకుంది.