Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఆయనేనా....ఎందుకంటే....

విజయవాడలో టీడీపీని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన విజయ్ ఎలక్ట్రికల్ అధినేత దాసరి జైరమేశ్‌ అయితే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాసరి జైరమేశ్‌ కుటుంబం రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేపథ్యంలో ఆయన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగితే గెలుపొందండం ఈజీ అని వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ysrcp vijayawada parliament candidate may be jairamesh
Author
Vijayawada, First Published Feb 15, 2019, 9:23 PM IST

విజయవాడ: కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వెయ్యాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ స్థానంపై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దృష్టిసారించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా చెప్పుకునే విజయవాడలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని నాని 70వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

దీంతో ఈసారి ఎలాగైనా ఆ సీటును దక్కించుకోవాలని వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావును విజయవాడ నుంచి బరిలోకి దించాలని ప్రయత్నించారు. అయితే విజయవాడ నుంచి పోటీ చేసేందుకు ఆయన ససేమిరా అనడం, వైసీపీ వీడటం కూడా జరిగిపోయింది. 

విజయవాడ పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన వైఎస్ జగన్ కు దగ్గుబాటి వెంకటేశ్వరరావు  తన స్నేహితుడిని తెరపైకి తెచ్చారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేశ్‌ ను లోటస్ పాండ్ కు తీసుకువచ్చారు దగ్గుబాటి. 

విజయవాడలో టీడీపీని ఢీ కొట్టాలంటే ఆర్థికంగా బలమైన విజయ్ ఎలక్ట్రికల్ అధినేత దాసరి జైరమేశ్‌ అయితే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాసరి జైరమేశ్‌ కుటుంబం రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేపథ్యంలో ఆయన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగితే గెలుపొందండం ఈజీ అని వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఫ్లాష్ టీం జరిపిన మూడు సర్వేలలో జై రమేష్ తెలుగుదేశం పార్టీకి గట్టిపోటీ ఇస్తున్నారని తెలిసింది. తెలుగుదేశం పార్టీకి కంటే 2శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కేఎల్ యూనివర్శిటీ నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకంటే 10శాతం ఓట్ల ఆధిక్యం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో జై రమేష్ కే విజయవాడ పార్లమెంట్ టికెట్ కన్ఫమ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జైరమేష్ సోదరుడు బాలవర్థనరావు కూడా అన్నకు సహకరిస్తే మంచి మెజారిటీ సాధించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 

దాసరి బాలవర్థనరావు 1999, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనను పక్కనపెట్టి వల్లభనేని వంశీమోహన్ ని రంగంలోకి దించారు. 

2014 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని బాలవర్థనరావు భావించినప్పటికీ చంద్రబాబు టికెట్ మాత్రం వంశీమోహన్ కే ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి బాలవర్థనరావు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. 

బాలవర్థనరావుకు గన్నవరం నియోజకవర్గంతోపాటు విజయవాడ పార్లమెంట్ పరిధిలో మంచి పట్టు ఉండటంతో అన్నదమ్ములిద్దరూ కష్టపడితే వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనని ప్రచారం జరుగుతుంది. మరి జగన్ టికెట్ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios