Asianet News TeluguAsianet News Telugu

ఆ మంత్రికి కమిషన్లు ఇవ్వకపోవడం వల్లే ఆరోగ్యశ్రీని నిలిపేశారు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 

ysrcp mla srikanthreddy fires on chandrababu over not give funds arogyasri
Author
Hyderabad, First Published Dec 17, 2018, 6:55 PM IST

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదల దగ్గర రేషన్‌ కార్డ్‌ ఉంటే చాలు  ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేయించుకోవచ్చనే ధీమా ఉండేదని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పోరేట్‌ వైద్యాన్ని పేదల చెంతకు చేర్చిన ఘనత ఆ మహానేతదే అని కొనియాడారు.  

ప్రపంచమంతా పొగిడిన ఆరోగ్యశ్రీని ఏ కారణాల వల్ల ఆపేశారంటూ ప్రశ్నించారు. తమకు చెల్లించాల్సిన రూ. 500 కోట్ల బకాయిలను చెల్లించకపోతే నేటి నుంచి ఆరోగ్యశ్రీని నిలిపివేస్తామని ప్రైవేట్‌ ఆస్పత్రులు తేల్చి చెప్తున్నాయన్నారు.

రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షన్‌దారులు వారి కుటుంబసభ్యులు అందరిని కలుపుకుని మొత్తం 35 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వాస్తవానికి ఉద్యోగులు, పెన్షన్‌దారుల ఆరోగ్యశ్రీ కోసం రూ. 200 కోట్లు చెల్లిస్తున్నారని మిగిలిన రూ. 300 కోట్లు చెల్లించలేరా అంటూ ప్రశ్నించారు. 

చార్టెడ్‌ ఫ్లయిట్‌లకు, విదేశీ పర్యటనలకు, దొంగ ధర్మపోరాట దీక్షలకు వందల కోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు పేదల వైద్యానికి మాత్రం రూ. 500 కోట్లు ఇవ్వలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చిన బాబుకు కమీషన్లు అందకపోవడం వల్లనే ఆరోగ్యశ్రీని ఇలా నిర్వీర్యం చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 1995 -2004 వరకూ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నేడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. 

దోమలపై దండయాత్ర, ప్రభుత్వ ఆస్పత్రులలో ఎలుకలు పట్టివేత అంటూ ఇలా ప్రతి చోటా కమీషన్లు మెక్కుతున్నారంటూ శ్రీకాంత్‌ ఎద్దేవా చేశారు. గతంలో రోమ్‌ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు నేడు నారా చక్రవర్తి కూడా రాష్ట్రంలో తుఫాన్‌ వస్తే తూతూమంత్రంగా సమీక్షలు చేసి చెన్నై వెళ్లి రాజకీయాలు చేస్తున్నారంటూ శ్రీకాంత్‌ మండిపడ్డారు. 

రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 3 నెలల పాటు పెన్షన్‌ తీసుకోకపోతే ఆరోగ్యశ్రీ వర్తించదని షరతులు పెట్టడం దారుణమన్నారు.  శ్రీకాంత్ రెడ్డి ఆరోగ్యశ్రీని నిలిపివేసి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అంటూ టీడీపీ వర్గానికి మేలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఒకప్పుడు అనారోగ్యం వస్తే పేదోళ్లు కార్పొరేట్ ఆస్పత్రుల ముందు ఉంటే నేడు జబ్బు చేస్తే ఆస్పత్రికి కాకుండా టీడీపీ ఎమ్మెల్యే, నాయకుల ఇళ్లమందు పడిగాపులు గాస్తున్నారంటూ విమర్శించారు. 

నాడు ధనికులతో పాటు పేదలు కూడా కార్పోరేట్‌ ఆస్పత్రులలో వైద్య సేవలు పొందేలా వైఎస్‌ ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దితే నేడు చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ పేదవాడు దేశంలో ఎక్కడ నుంచైనా చికిత్స చేసుకునేలా ఆరోగ్యశ్రీని తీర్చిదిద్దబోతున్నారని తెలిపారు. జేబులో రూ. 1000 ఉంటే చాలు ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చని రూ.1000 నుంచి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 

ప్రైవేట్ ఆస్పత్రులు చాలా రోజుల నుంచి తమకు బకాయిలు చెల్లించలేదని హెచ్చరిస్తూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం  పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చెయ్యాలని లేని పక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios