ఇదేం ప్రస్టేషన్ చంద్రబాబూ!: వైసీపీ నేత సజ్జల ఫైర్
పిడుగులు పడి గత వారం ఏడుగురు చనిపోయారని, అయితే తన ఆధ్వర్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు.
చంద్రబాబు రివ్యూలు చేసి ఉంటే పిడుగులు కూడా ఆపేవాడిని అని లెటర్ లో పేర్కొన్నారంటే ఆయనకు అధికారంపై ఎంత యావ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంపై ఆజన్మాంతం తనకు హక్కు ఉందని చంద్రబాబు భ్రమలో బతుకుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు హక్కును ఎన్నికల కమిషన్ తీసేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లుగా విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నూతన ప్రభుత్వంకు వేదిక సిద్ధం చేసేలా వ్యవహరించాల్సింది పోయి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో గెలిచారని అత్తెసరు ఓట్లతో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 70 ఏళ్ల వయస్సులో మనవడితో ఆడుకుంటూనో యాత్రలు చేయాల్సిన వ్యక్తి రోజూ రకరకాల ప్రకటనలతో గందరగోళ పరిస్దితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని పదవికి పోటీ పడుతున్న నరేంద్ర మోది, రాహుల్ గాంధీలాంటి వాళ్లు కూడా ఇలా చేయరేమోనని నిలదీశారు. చంద్రబాబు లెటర్ చూస్తే అంతా స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ తో సహా అందర్ని దబాయిస్తున్నారని విమర్శించారు.
సీఎం అయిన తాను రివ్యూలు చేయకపోతే రాష్ట్రంలో ఏదైనా జరిగితే, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతే ఈసీనే కారణం అవుతోందని లెటర్ లో పేర్కొనడం విడ్డూరమన్నారు.ప్రపంచలోనే ఈసి పెద్ద డిక్టేటర్ అయినట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల ప్రక్రియను ఎవ్వరైనా ఫాలో అవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలకు సమయం ఉండటంతో ఆలోపు ఇష్టం వచ్చినట్లు చేద్దామని చంద్రబాబు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. దోచుకున్నదో ఇంకా దోచుకోవాలనేదో ఉంది కాబట్టి రివ్యూలు ఆపుతారా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు బిల్లులు పెండిగ్ లో ఉండటంతో తొలుత పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ చేశారని బయటకు వచ్చేసరికి మాత్రం రివ్యూపై చేశానని చెప్పుకొచ్చారని మండిపడ్డారు. సిఆర్డిఏ రాజధాని నిర్మాణం అంటూ హంగామా చేసిన చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదన్నారు.
ఈనెల రోజులలో బిల్డింగ్లన్నీ కట్టేట్లు లెటర్ లో రాశారని చెప్పుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ కేసుల గురించి క్లియర్ చేయాల్సినవి ఉన్నాయని అలాగే సిఐడి గురించి రివ్యూ చేశారని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై కేసులను కొట్టేయించేందుకే రివ్యూ చేశారని ఆరోపించారు.
2009 లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదని చెప్పుకొచ్చారు. కుటుంబంతో గడిపారని గుర్తు చేశారు. పిడుగులు పడి గత వారం ఏడుగురు చనిపోయారని, అయితే తన ఆధ్వర్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు.
చంద్రబాబు రివ్యూలు చేసి ఉంటే పిడుగులు కూడా ఆపేవాడిని అని లెటర్ లో పేర్కొన్నారంటే ఆయనకు అధికారంపై ఎంత యావ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు పిడుగులు ఆపగలిగారో చెప్పగలరా? అంటూ నిలదీశారు సజ్జల.
చంద్రబాబు లెటర్ చూస్తుంటే చాలా ప్రస్టేషన్లో ఉన్నారని అర్థమవుతుందన్నారు. ఫారం-7 ద్వారా ఓట్లు తొలగించారని, డేటా చోరీతో ఓట్లు అక్రమాలు జరిగాయని తాము ఫిర్యాదు చేస్తే అదేదో తామే నేరం చేసినట్లు లెటర్ లో ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు రాష్ట్రానికి కష్టాలు తెచ్చారు కాబట్టే ఆయనను ఇంటికి సాగనంపే ప్రక్రియను ప్రజలు చేపట్టారని చెప్పుకొచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేసరికి తనపై ఉన్న కేసులు గురించి తప్పించుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారని ఆరోపించారు.
భవిష్యత్ లో తనకు సహకరిస్తారన్న నమ్మకంతో ఇతర పార్టీలకు ప్రచారం కోసం వెళ్తున్నారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టు పాతకేసులపై స్టేలు ఎత్తివేయమని సూచించిందని ఇక చంద్రబాబుపై కేసులు మళ్లీ మెదటికి వస్తాయన్నారు. ఇప్పటికే లక్ష్మీపార్వతి పెట్టిన కేసు బయటకు వచ్చిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.