సర్వే ఫలితాలతో జగన్ ధీమా: అవసరమైతే ప్లాన్ బీ రెడీ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ఫలితాలతోపాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులపై జగన్ ఓ కొలిక్కి వచ్చారని తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలలో మేజిక్ ఫిగర్ కు కాస్త అటు ఇటు అయితే ఎలాంటి వ్యూహం అమలు చెయ్యాలని అనే అంశంపై కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహించారు. పోలింగ్ సరళిపై ఆరా తీశారు.
నియోజకవర్గాల వారీగా పూర్తి వివరాలు సేకరించారు. అయితై ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. కౌంటింగ్ డేట్ దగ్గరకు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది.
ఈనెల 19న ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు, పార్టీ కీలక నేతలతో వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ సరళిపై సమీక్షించడంతోపాటు మే 19 సాయంత్రం విడుదల కానున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎవరెవరు స్పందించాలని అనే అంశాలపై జగన్ పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ఫలితాలతోపాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులపై జగన్ ఓ కొలిక్కి వచ్చారని తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలలో మేజిక్ ఫిగర్ కు కాస్త అటు ఇటు అయితే ఎలాంటి వ్యూహం అమలు చెయ్యాలని అనే అంశంపై కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో జిల్లాకు సంబంధించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు ఒక కీలక నేతను ఇంచార్జ్ గా నియమించనున్నారని తెలుస్తోంది. ఆ జిల్లాలో ఎమ్మెల్యేల బాధ్యత అంతా ఆ నేతకే అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఎవరికీ మేజిక్ ఫిగర్ రాకపోతే ఎమ్మెల్యేలు అటు ఇటూ అయ్యే ఛాన్స్ ఉందని ఆ నేపథ్యంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని అయితే కాస్త అటు ఇటు జరిగినా చెప్పలేమని అయినా అప్రమత్తతో ఉండాలంటూ జగన్ నేతలకు హతబోధ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణ పనులపై ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు ఒక్క ముందు రోజు లోపే పనులు పూర్తి చేసే బాధ్యతను వారికి జగన్ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మే 22న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జగన్ సమావేశం నిర్వహించే యోచనపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ అమరావతిలో కాకుండా హైదరాబాద్ లో ఉండటంపై అధికార తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు వీలైనంత త్వరలోనే అమరావతికి చేరుకోవాలని జగన్ భావిస్తున్నారు.
మెుత్తానికి మే 19న వైఎస్ జగన్ నిర్వహించబోయే సమావేశం అత్యంత కీలకమైనదని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పలువురు వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మే 19న కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చ జరగనున్నట్లు విజయసాయిరెడ్డి తన అనుచరుల వద్ద తెలిపారట.