గవర్నర్ తో గంటకుపైగా జగన్ భేటీ: చంద్రబాబుపై ఫిర్యాదు
గవర్నర్ తో భేటీ తర్వాత వైఎస్ జగన్ శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో ఆయన గంటకుపైగా భేటీ ఆయ్యారు. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలనే గవర్నర్ కు వివరించినట్లు జగన్ తెలిపారు.
గవర్నర్ తో భేటీ తర్వాత వైఎస్ జగన్ శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తూ తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ఆయన అన్నారు. నాలుగేళ్లు బిజెపిని భుజాన మోసింది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని వ్యాఖ్యానించింది కూడా చంద్రబాబేనని ఆయన అన్నారు.
ఢిల్లీలో చంద్రబాబు దీక్షపై ఆయన తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఓ హత్య చేసిన హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నట్లుగా చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఉందని ఆయన అన్నారు.