అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం: టీటీడీ పాలకమండలి నిర్ణయం
నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం నిర్మాణానికి 150 కోట్లు కేటాయిస్తూ దేవస్థానం ధర్మకర్తల పాలక మండలి తీర్మానం చేసింది. మంగళవారం జరిగిన ధర్మకర్తల పాలక మండలి సమావేశంలో అధ్యక్షుడు పుట్టా సుధాకర్యాదవ్ తోపాటు పాలకమండలి సభ్యులు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల: నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యక్షేత్రం నిర్మాణానికి 150 కోట్లు కేటాయిస్తూ దేవస్థానం ధర్మకర్తల పాలక మండలి తీర్మానం చేసింది. మంగళవారం జరిగిన ధర్మకర్తల పాలక మండలి సమావేశంలో అధ్యక్షుడు పుట్టా సుధాకర్యాదవ్ తోపాటు పాలకమండలి సభ్యులు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీటీడీ కళ్యాణ మండపాల అభివృద్ధికి 37కోట్ల రూపాయలు కేటాయిస్తూ తీర్మానించింది. అలాగే తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి 79కోట్ల రూపాయలు కేటాయించింది. టీటీడీ పరిధిలోని గ్రంథాలయాలకు టీటీడీ ఆధ్యాత్మిక ప్రచురణలు పంపిణీ చెయ్యాలని తీర్మానించింది. అలాగే 65 మంది డ్రైవర్లు, ఫిట్టర్లకు జీతాలు పెంచుతూ తీర్మానించింది.
అటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాల ధరల నిర్ణయంపై కమిటీ ఏర్పాటు చేసింది. వకుళా సదన్ యాత్రికుల రెండో వసతి సముదాయం నిర్వహణకు 19.5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇకపోతే ఒంటిమిట్ట యాత్రికుల వసతి సముదాయం నిర్మాణం ఏపీ టూరిజం శాఖకు కేటాయిస్తూ ధర్మకర్తల పాలక మండలి తీర్మానించింది.