జగన్ కి షాక్: టీవీ ఛానెల్స్ ప్రసారాలపై టీడీశాట్ కీలక ఆదేశాలు
ఇప్పటికైనా ఏపీలో టీవీ5 ఛానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో ఈనెల 22 వరకు రోజుకు రూ.2లక్షలు చొప్పున జరిమానా పెంపుతోపాటు 23న లోకల్ కమిషనర్ బృందాన్ని పంపనున్నట్లు టీడీశాట్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిపివేయబడ్డ టీవీ5 ఛానెల్స్ ప్రసచారాలను తక్షణమే అమలు చేయాలంటూ టీడీశాట్ ఏపీ ఫైబర్ నెట్ కు సూచించింది. టీవీ5 ఛానల్ పై అక్రమ తొలగింపు కేసులో ఏపీ ఫైబర్ నెట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీవీ 5 న్యూస్ ఛానెల్ తొలగింపునకు సంబంధించి రూ.32లక్షలు జమ చేయాల్సిందిగా టీడీశాట్ ఆదేశించింది. అలాగే టీవీ5 ఛానెల్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని మరోసారి ఆదేశించింది.
తమ ఆదేశాలను ఏపీ ఫైబర్ నెట్ తక్షణమే అమలు చేయాలని లేనిపక్షంలో కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని టీడీశాట్ ప్రధాన కార్యాలయానికి పంపి అమలు పరుస్తామని హెచ్చరించింది.
లోకల్ కమిషనర్ కమిటీలో ఉండే సభ్యులను ట్రిబ్యునల్ నిర్ణయించింది.
కమిటీ సభ్యులుగా లోకల్ కమిషనర్, ట్రిబ్యునల్ నిర్ణయించిన ఇండిపెండెంట్ అడ్వకేట్ కమిషనర్, సాంకేతిక రంగ ఆడిటర్ కమిటీని నియమించింది.
తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేస్తున్నారంటూ ఏపీ ఫైబర్ నెట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాము ఇప్పటికే సంవత్సరానికి రూ.150 కోట్ల నష్టాల్లో ఉన్నామని ఈ జరిమానా చెల్లింపులో కొంత ఇబ్బందులు ఉన్నాయంటూ ఏపీ ఫైబర్ నెట్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే జరిమానాలో ఎలాంటి మినహాయింపు ఉండదని టీడీశాట్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికైనా ఏపీలో టీవీ5 ఛానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో ఈనెల 22 వరకు రోజుకు రూ.2లక్షలు చొప్పున జరిమానా పెంపుతోపాటు 23న లోకల్ కమిషనర్ బృందాన్ని పంపనున్నట్లు టీడీశాట్ స్పష్టం చేసింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఊరట
అటు ఏపీలో నిలిచిపోయిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్దరించాలని టీడీశాట్ స్పష్టం చేసింది. రెండు రోజుల్లో ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడం ఏపీ ఫైబర్ నెట్ కోర్టు ధిక్కారణకు పాల్పడినట్లేనని టీడీశాట్ అభిప్రాయపడింది.
అయితే టీడీశాట్ కు సాంకేతికకారణంగానే ఛానల్ ప్రసారాలు నిలిచిపోయాయని ఏపీ ఫైబర్ నెట్ వివరణ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 22లోపు ఏబీఎన్ ప్రసారాలు పునరుద్ధరిస్తామని టీడీశాట్కు ఏపీ ఫైబర్ నెట్ స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై గుర్రుగా ఉన్న టీడీశాట్ ఈనెల 22 తర్వాత ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది టీడీశాట్.