ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ రెడీ
:రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో కూడ పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది
అమరావతి:రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో కూడ పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. గతంలో కూడ కొన్ని స్థానాల్లో పోటీ చేసింది. జాతీయ రాజకీయాల్లో కూడ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.
వచ్చే ఏడాది ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఒడిశాలోని బరంపుర, కటక్, రాయగడ, కోరాపుట్ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై ఆ పార్టీ నేతలు చంద్రబాబునాయుడుతో చర్చించారు.
ఈ రాష్ట్రంలోని రాయగడ, మల్కన్ గిరి, గంజాం, నవరంగపూర్ జిల్లాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పరిస్థితులపై సర్వే నిర్వహిస్తున్నారు. మరో వైపు 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు.