టీడీపీకి షాక్:జనసేనకు జై కొట్టిన తెలుగు తమ్ముళ్లు
విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. యలమంచిలి నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తోన్న సుందరపు విజయ్ కుమార్ జనసేనకు జై కొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ సమక్షంలో విజయ్ కుమార్ జనసేన పార్టీలో చేరారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. యలమంచిలి నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తోన్న సుందరపు విజయ్ కుమార్ జనసేనకు జై కొట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ సమక్షంలో విజయ్ కుమార్ జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సుందరపు విజయ్ కుమార్ కు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.
యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరించే సుందరపు విజయ్ కుమార్ 2014 ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు. అయితే ఆఖరి నిమిషం వరకు ఊరించిన అధిష్టానం చివరకు టిక్కెట్ ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఆఖరి నిమిషంలో భంగపడ్డ సుందరపు విజయ్ కుమార్ స్థబ్ధుగా ఉండిపోయారు.
అయితే విజయ్ కుమార్ కు జనసేన పార్టీ తరుపునుంచి ఆహ్వానం పలకడంతో ఆ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు. ఈ నేపథ్యంలో శనివారం జనసేన పార్టీలోకి జంప్ అయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి దగ్గరగా వుంటున్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చాయని, ఆయనలా ప్రజలకు అండగా ఉండేందుకు జనసేనలో చేరానని విజయ్ కుమార్ తెలిపారు.
వీరితోపాటు మునగపాక టీడీపీకి చెందిన దివంగత జెడ్పీటీసీ దాడి లక్ష్మీసత్యనారాయణ సతీమణి హెన్నా కూడా జనసేన పార్టీలో చేరారు. గోపాలపట్నానికి చెందిన బిల్డర్ విల్లా శ్రీనివాసరావు సైతం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విల్లా శ్రీనివాసరావు గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ఇకపోతే గాజువాక నియోజకవర్గానికి చెందిన ఈటి రంగారావు, పాయకరావుపేటకు చెందిన శివదత్, యంగ్ ఇండియా ట్రస్టు ప్రతినిధి పి.వెంకట సురేశ్, విశాఖకు చెందిన న్యాయవాది చంద్రమౌళి జనసేన పార్టీలో చేరారు.