ఏపీలో తలసాని పర్యటన ఎఫెక్ట్.. దుర్గ గుడిలో ఆంక్షలు
ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్..ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్..ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన పర్యటన అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దేవస్థానం వారు ఆంక్షలు విధించారు.
ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ వచ్చిన తలసాని.. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని ఈవో ఛాంబర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలన సరిగాలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తలసాని వ్యాఖ్యలతో రాజకీయ దుమారం లేచింది.
ఈ నేపథ్యంలో ఈవో కోటేశ్వరమ్మ దుర్గగుడి ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి వచ్చే ప్రముఖలు ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈవో కోరారు.