వైఎస్ జగన్ కు చిక్కులు: రైతు భరోసా లబ్ధిదారుల్లో మంత్రి పేరు
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో నిబంధనలకు విరుద్దంగా లబ్దిదారుల పేర్లకు చోటు లభించింది.ఈ విషయమై అధికారుల తీరుపై ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఒంగోలు: పేద రైతులకు పెట్టుబడి సహాయం చేసేందుకు ఉద్దేశించిన వైఎస్ఆర్ రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేష్ కు కూడ చోటు దక్కింది. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద విచారణను మొదలుపెట్టారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామ పరిధిలో పట్టాదారు ఖాతా నెంబర్ 1881లో మంత్రి ఆదిమూలపు సురేష్ కు 94 సెంట్ల భూమి ఉంది. కర్నూల్, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కూడ తనకు భూములు ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వచ్చేవారికి ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఈ పథకంలో సాక్షాత్తు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు చోటు దక్కింది.
"
మంత్రి సురేష్ పేరు ఎలా వైఎస్ఆర్ రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో చోటు దక్కందనే విషయమై ప్రస్తుతం ఏపీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై వ్యవసాయశాఖాధికారులు ఉరుకులు పరుగుల మీద విచారణకు దిగుతున్నారు.